SSC Exam Paper Leak: ఇకపై పేపర్‌ లీక్‌ చేస్తే దబిడి దిబిడే.. విద్యాశాఖ కీలక నిర్ణయం

|

Feb 06, 2025 | 10:20 AM

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి జరగనున్న టెన్త్ పబ్లిక్‌ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టేందుకు తొలిసారిగా సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. పబ్లిక్‌ పరీక్షల సమయంలో యేటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలు చర్యలకు ఉపక్రమించింది..

SSC Exam Paper Leak: ఇకపై పేపర్‌ లీక్‌ చేస్తే దబిడి దిబిడే.. విద్యాశాఖ కీలక నిర్ణయం
SSC Paper Leak
Follow us on

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అనంతరం మార్చి 21 నుంచి టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయి. అయితే పబ్లిక్‌ పరీక్షల సమయంలో యేటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారాయి. అయితే ఈ సారి మాత్రం పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారిగా టెన్త్ ప్రశ్నాపత్రాలపై సీక్రెట్‌ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించనుంది. ఈ మేరకు పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో ఈ సీక్రెట్‌ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. ఈ కోడ్‌ ద్వారా ఎక్కడైనా పేపర్‌ను లీక్‌ చేస్తే గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యచరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.1 లక్షల మంది విద్యార్థులు పదో తగరతి పరీక్షలు రాయనున్నారు.

అలాగే పేపర్‌ లీకేజీలకు పాల్పడిన వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. గతంలో కొందరు ఇన్విజిలేటర్లు పదో తరగతి పేపర్లను లీక్‌ చేయడం, వాట్సాప్‌లో షేర్‌ చేయడం వంటి సందర్భాలు పలుమార్లు చోటు చేసుకున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎవరైనా పేపర్ లీకేజీలకు పాల్పడినట్లు తేలితే వారిని కేవలం సస్పెన్షన్‌లతో సరిపెట్టకుండా.. ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్లు హెచ్చరించింది. టీచర్లు సైతం ఇలాంటి చర్యలకు సాహసించేది లేదని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈసారి టెన్త్ పరీక్షల్లో ఏయే మార్పులుంటాయంటే..

  • 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్షలకు హజరయ్యే విద్యార్థులకు మొత్తం 24 పేజీల బుక్‌లెట్‌ను అందించనున్నారు. గతంలో విడిగా పేపర్లు ఇచ్చేవారు. ఆన్సర్లు రాసిన పేపర్లన్నింటినీ కూర్చి, దారం కట్టాల్సి వచ్చేది. ఇక నుంచి కేవలం బుక్‌లెట్‌ మాత్రమే ఇవ్వనున్నారు.
  • అలాగే ఈ ఏడాది నుంచి గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి చెప్పనున్నారు. గ్రేడ్లకు బదులు విద్యార్థులకు కేవలం మార్కులు మాత్రమే ఇస్తారు. అంటే ఇంటర్నల్స్‌, థియరీ పరీక్షల మార్కులను కలిపి మొత్తం మార్కులేస్తారన్నమాట.
  • ఇక పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల విధానం కూడా కేవలం ఈ ఏడాది మాత్రమే ఉంటుంది. 2025- 26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్‌ మార్కులు ఉండవు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • గతేడాది నుంచి ఆరు పేపర్లకుగాను ఏడు రోజులపాటు పరీక్షలను నిర్వహిస్తున్నారు. సైన్స్‌లో జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పేపర్లకు రెండు రోజుల పాటు పరీక్షలను నిర్వహించేవారు.
  • పదో తరగతి మెమోలపై పర్మినెంట్‌ ఎడ్యకేషన్‌ నెంబర్‌ (పెన్‌)ను ముద్రిస్తారు. ఆధార్‌ ఎలాగో విద్యార్థులకు ఈ ‘పెన్‌ నంబర్’ కూడా అలాగే పనిచేస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.