హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అనంతరం మార్చి 21 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. అయితే పబ్లిక్ పరీక్షల సమయంలో యేటా పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారాయి. అయితే ఈ సారి మాత్రం పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారిగా టెన్త్ ప్రశ్నాపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ను ముద్రించనుంది. ఈ మేరకు పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో ఈ సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ను ముద్రించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. ఈ కోడ్ ద్వారా ఎక్కడైనా పేపర్ను లీక్ చేస్తే గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యచరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.1 లక్షల మంది విద్యార్థులు పదో తగరతి పరీక్షలు రాయనున్నారు.
అలాగే పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. గతంలో కొందరు ఇన్విజిలేటర్లు పదో తరగతి పేపర్లను లీక్ చేయడం, వాట్సాప్లో షేర్ చేయడం వంటి సందర్భాలు పలుమార్లు చోటు చేసుకున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎవరైనా పేపర్ లీకేజీలకు పాల్పడినట్లు తేలితే వారిని కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టకుండా.. ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్లు హెచ్చరించింది. టీచర్లు సైతం ఇలాంటి చర్యలకు సాహసించేది లేదని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.