
హైదరాబాద్, మే 31: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ తొలి దశ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు మే 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ గడువును జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి జూన్ 2వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా దోస్త్ ప్రవేశాలను మొత్తం మూడు విడతల్లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రతీయేట ప్రవేశాలు కల్పించేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది.
ఏపీలో డీఈఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్) 2024 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. డీఈఈసెట్లో వచ్చిన ర్యాంకు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీ డీఈఈసెట్ 2024 పరీక్ష మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రవేశాలకు జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జూన్ 10న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 12 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.