
హైదరాబాద్, అక్టోబర్ 18: తెలంగాణ గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబరు 18) సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదగా నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోన శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 783 మందికి నియామక లెటర్లు అందించనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఇక విభాగాల వారీగా ఆయా పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులను నియమించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
శనివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న అనంతరం ఆయా అభ్యర్థులు పోస్టుల్లో చేరనున్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. ఇక ఎంపికైన అభ్యర్ధులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని, విత్ హెల్డ్లో పెట్టినట్లు కమిషన్ వెల్లడించింది. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. అందువల్ల ఆయా శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.