
హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది పదో తరగతి హాల్ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్నకు నేరుగా పంపించాలని విద్యాశాఖ భావిస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఈ హాల్ టికెట్లను పంపించనున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది నుంచి హాల్టికెట్లపై క్యూఆర్కోడ్ను కూడా ముద్రించనున్నారు. స్మార్ట్ఫోన్తో ఈ క్యూఆర్కోడ్ను స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ నావిగేట్ వస్తుంది. దీని ద్వారా విద్యార్థులు తమ ఎగ్జాం సెంటర్ రూట్ మ్యాప్తో సులువుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చని తెలిపారు.
కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక పదో తరగతి హాల్టికెట్లను మార్చి 5న విడుదల కానున్నాయి. వీటిని అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు, విద్యార్ధుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్కు సైతం పంపిస్తారు. మరోవైపు ప్రింటెడ్ హాల్టికెట్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు విద్యాశాఖ చేరవేస్తుంది. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రం నుంచి 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,512 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తంగా 5,28,238 మంది పరీక్షలు రాయనున్నారు.
గతేడాదితో పోల్చితే 20వేల మంది విద్యార్థులు అదనంగా ఈ పరీక్షలు రాయనున్నారు. విద్యార్ధుల సంఖ్య పెరగడంతో పరీక్ష సెంటర్ల సంఖ్యను కూడా పెంచారు. అంతేకాకుండా ఈ ఏడాది అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధుల సౌలభ్యార్ధం క్లోక్రూంలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్లను క్లోక్రూంలో ఇచ్చి ఎగ్జామ్ పూర్తయ్యాక తీసుకువెళ్లవచ్చు.
తెలంగాణ పదో తరగతి 2026 హాల్టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.