హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి రంజాన్ పండగ సందర్భంగా పరీక్షల సమయాల్లో మార్పు చేస్తూ ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది కూడా. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12.15 గంటల లోపుపే మధ్యాహ్న భోజనం అందించాలని ఆయా పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్ష ఉంటుంది. భౌతిక, రసాయన శాస్త్రాలు ఒక పేపర్గా, జీవశాస్త్రం మరో పేపర్గా 50 మార్కుల చొప్పున 100 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.