Free Data Engineering Course: డేటా ఇంజినీరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎవరు అర్హులంటే?

యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించే ప్రయత్నంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ.. శ్రీ సత్యసాయి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కింద ఉచిత డేటా ఇంజనీర్ కోర్సును ప్రారంభిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంజనీరింగ్ రంగంలో దూసుకుపోవడానికి అవసరమైన నైపుణ్యాలతో నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది..

Free Data Engineering Course: డేటా ఇంజినీరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎవరు అర్హులంటే?
Free Data Engineering Course

Updated on: Jan 31, 2025 | 8:50 AM

హైదరాబాద్‌, జనవరి 31: నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా డేటా ఇంజినీరింగ్‌ కోర్సులో ఉచిత శిక్షణను అందించేందుకు తాజాగా శ్రీసత్యసాయి సేవా ఆర్గనైజేషన్‌ ప్రకటన జారీ చేసింది. 2021-2024 సంవత్సరాల మధ్య బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్పులు పూర్తి చేసిన వారు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ కోర్సులో శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్ అందించడంలో సత్యసాయి సంస్థలు సహకరిస్తాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన ఇతర సమాచారం ఇదే సైట్‌లో అందుబాటులో ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 5, 2025వతేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని సూచించింది.

అయితే వచ్చిన దరఖాస్తులను బట్టి.. ఈ సంస్థ ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి పైథాన్, ఎస్‌క్యూఎల్, పవర్‌ బీ, సాఫ్ట్‌స్కిల్స్‌లో మూడు నెలల పాటు హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారు. శిక్షణలో భాగంగా రూ.50 వేల విలువైన కోర్సును ఉచితంగా అందించనున్నారు. దిగ్గజ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ కోసం ఎంపికైన వారు సొంతంగా వసతి ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుంది. ఇతక సమాచారం కోసం 9052372023 ఫోన్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించాలని సంస్థలు తెలిపాయి.

మరో రెండు రోజుల్లో ముగుస్తున్న సీయూఈటీ పీజీ దరఖాస్తు గడువు

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 2తో ముగుస్తుంది. 2025-26 అకాడమిక్ సెషన్ కోసం నిర్వహించనున్న సీయూఈటీ – పీజీ 2025 ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం మార్చి మార్చి 13 నుంచి 31 తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.