
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారతీయ రైల్వే త్వరలోనే మరో నోటిఫికేషన్ జారీ చేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లు, రీజియన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 4,098 పోస్టులను భర్తీ చేయనుంది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 04/2026) ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నియామకాల్లో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులను భర్తీ చేయనున్నారు. రైల్వేలో సాంకేతిక విభాగాల్లో ఉద్యోగం పొందాలనుకునే ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆర్ఆర్బీ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ (జేఈ) పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వారీగా విద్యార్హతల పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అందులో వెల్లడించనున్నారు. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనంగా నెలకు రూ.35,400 చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా రైల్వే నిబంధనల ప్రకారం అందుతాయి.
అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-1), స్టేజ్ 2లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT-2), అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్.. ఈ అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది నియామకం కల్పిస్తారు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, విభాగాల వారీగా ఖాళీలు, సిలబస్, ఎంపిక విధానం పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.
ఆర్ఆర్బీ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ (జేఈ) పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.