
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రైల్వే శాఖ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్లైన్ దరఖాస్తులను మే 11, 2025వ తేదీలోపు సమర్పించాల్సి ఉంది. అయితే తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. దీంతో మే 19, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ నోటిఫికేషన్ కింద అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.. రిజియన్లలో నియామకాలు చేపట్టనున్నారు. పదో తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు..ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250.. జనరల్ అభ్యర్ధులకు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.19,900తోపాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.