TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టెట్‌-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టెట్‌ అర్హత లేకుంటే పదోన్నతులు లభించకపోవడంతో పాటు ఉద్యోగ భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెట్‌ పాస్‌ కాని వేలాది మంది ఇన్‌-సర్వీస్‌ టీచర్లకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది..

TET అర్హత లేకుంటే ప్రమోషన్ లేనట్లే.. ఉద్యోగానికీ గండమే..! ప్రభుత్వ టీచర్లకు మరో గోల్డెన్ ఛాన్స్
Special TET for Government Teachers

Updated on: Jul 22, 2026 | 6:35 AM

హైదరాబాద్‌, జులై 22: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ 2026 నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆగస్ట్‌ 31, 2028వ తేదీలోపు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు టెట్ అర్హత సాధించవల్సి ఉంటుంది. లేదంటే ఉద్యోగం విరమించవల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతులు పొందాలన్నా టెట్‌ పాస్‌ కావాల్సిందే.

ఈ నేపథ్యంలో ఈ మూడేళ్లలో ఇన్‌ సర్వీస్‌ టీచర్లు తప్పనిసరిగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌)లో అర్హత సాధించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా తొలి స్పెషల్ టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్‌ పాస్‌ కాని ప్రభుత్వ టీచర్లు సుమారు 20 వేల మంది ఉంటారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. వీరంతా టెట్‌లో అర్హత సాధించడానికి వీలుగా ప్రకటన ఇచ్చింది. అయితే బీఈడీ విద్యార్హత ఉండి.. ఎస్‌జీటీలుగా పనిచేస్తున్నవారు పేపర్‌ 2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. మోడల్‌ స్కూళ్లలోని TGTలుగా ఉన్న వారు కూడా పేపర్‌ 2 రాయవచ్చు. ఫలితంగా వీరికి పదోన్నతులు లభించనున్నాయి.

టెట్‌లో అర్హత మార్కులు మార్చాలని టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా డీఎస్సీ రాసే నిరుద్యోగులకు టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. తాము ఇప్పటికే డీఎస్సీ రాసినందున తమకు టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ లేనందున.. అందరికీ ఉమ్మడిగా ఒకే విధమైన అర్హత మార్కులు నిర్ణయించాలని టీచర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 150కు 60 మార్కులు, బీసీలకు 75, జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు విద్యాశాఖ పరిగణిస్తుంది. ఆసక్తి కలిగిన టీచర్లు జులై 29, 2026వ తేదీలోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీకలు సెప్టెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

Follow Us