
హైదరాబాద్, మే 29: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతోంది. జూన్ 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్ కోసం ప్రశ్నాపత్రం తయారీ నుంచి చివరి విద్యార్థి చేతికి చేరే వరకు ప్రతి దశను కఠినంగా పర్యవేక్షించనుంది. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పుడు ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, భద్రపరచడం, పరీక్షా కేంద్రాలకు పంపిణీ వంటి మొత్తం ప్రక్రియను పీఎంఓ అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు.
నీట్ పరీక్ష వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా దృష్టి సారించినట్లు సమాచారం. పరీక్షకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన అంశంపై ఆయనకు నిరంతరం సమాచారం అందుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జరిగిన నీట్ పరీక్షలో అవకతవకల సంకేతాలు బయటపడిన వెంటనే ప్రధాని ఆదేశాల మేరకే పరీక్షను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే రీ-ఎగ్జామ్ ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్లలో పలు కేంద్ర సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్న ఈ నీట్ రీ-ఎగ్జామ్ కోసం ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయిలో నిఘా వ్యవస్థను అమలు చేయనున్నట్లు సమాచారం. గత వివాదంతో దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే కేంద్రం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.