
మంచిర్యాల, జులై 15: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థలో అర్థరాత్రి కలకలం రేగింది. వసతులు సరిగా లేవంటూ ఏకంగా 17 మంది విద్యార్థులు రాత్రికి రాత్రి హస్టల్ ను వదిలి మంచిర్యాల బాట పట్టారు. ఇంటికి వెళ్లకుండా నేరుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంటికి చేరుకున్న విద్యార్థులు తమ గోడును ఎమ్మెల్యే కు చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సతీమణి మాజీ డీసీసీ నాయకురాలు కొక్కిరాల సురేఖకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన విద్యార్థులను ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టించి నేరుగా సమస్యను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ. వెంటనే అదికారులకు ఫోన్ చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విద్యార్థులకు నచ్చ చెప్పి తిరిగి ప్రత్యేక వాహనం లో చెన్నూర్ హాస్టలకు పంపించారు ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ. అసలు ఏం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 మంది విద్యార్థులు ఉన్నట్టుండి రాత్రి హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయారు. గత ఏడాది ఈ 17 మంది విద్యార్థులు మంచిర్యాల నియోజక వర్గంలోని లక్షేట్టిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరం విద్యనభ్యసించారు. ఈ ఏడాది ఈ 17 మంది విద్యార్థులను సెకండ్ ఇయర్ కోసం చెన్నూరుకు బదిలీ చేశారు అదికారులు. అయితే చెన్నూరు హాస్టల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో 17 మంది విద్యార్థులు హస్టల్ నుండి బయటకు వెళ్లిపోయారు.
తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు చెప్పుకునేందుకు రాత్రి 9 గంటలకు చెన్నూర్ నుండి ఆర్టీసీ బస్ లో మంచిర్యాల చేరుకున్నారు. బస్టాండ్ నుండి నేరుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంటికి వెళ్లిన విద్యార్థులు ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు కళాశాల అధ్యాపకులను పిలిపించి మాట్లాడిన సురేఖ.. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భోజనం పెట్టించి.. విద్యార్థులను డీసీఓ శ్రీధర్కు అప్పగించి టాటా ఏస్ వాహనంలో తిరిగి చెన్నూరుకు పంపించారు సురేఖ. అయితే విద్యార్థులు హాస్టల్ వదిలి వెళ్లినప్పటికీ ఇప్పటివరకు వారి తల్లిదండ్రులకు అక్కడి సిబ్బంది ఎలాంటి సమాచారం అందించకపోవడం పై తల్లి తండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ అమ్మలా ఆదరించి తమ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి సమస్యలను పరిష్కరించి తిరిగి హస్టల్ కు పంపండం పై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.