
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్.. వివిధ విభాగాలకు సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ‘ఏ’ గేజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అసక్తి కలిగిన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద జనరల్ డ్యూటీ (జీడీ), టెక్నికల్ (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) విభాగాల్లో మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ కమాండెంట్ (జనరల్ డ్యూటీ – జీడీ) పోస్టులు 140, అసిస్టెంట్ కమాండెంట్ (టెక్నికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టులు30 వరకు ఉన్నాయి. ఈ మేరకు 2027 బ్యాచ్కు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది.
జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇక టెక్నికల్ బ్రాంచ్లో పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ల్ విభాగంలో డిగ్రీ ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే జులై 1, 2001 నుంచి జూన్ 30, 2005 మధ్య జన్మించి ఉండాలి. కోస్ట్ గార్డ్/ ఆర్మీ/ నేవీ/ ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ల వరకు, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్)కు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్లో సూచించిన విధంగా ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జులై 23, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్ధుల ఎంపిక మొత్తం 5 దశలుగా జరుగుతుంది. స్టేజ్-Iలో ఆన్లైన్ రాత పరీక్ష. స్టేజ్-IIలో అర్హతా పరీక్షలు, గ్రూప్ డిస్కషన్. స్టేజ్-IIIలో సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ. స్టేజ్-IVలో న్యూఢిల్లీ బేస్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు. స్టేజ్-V మెరిట్ ఆధారంగా తుది ఎంపిక.. ఈ ఐదు దశల్లో ప్రతిభకనబరచిన వారికి ఉద్యోగం కేటాయిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.