
అమరావతి, ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 25) ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా కేఎస్ జవహర్రెడ్డి ప్రకటించారు. శనివారం కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో నిర్వహించిన వర్చువల్గా సమీక్షలో ఈ మేరకు తెలిపారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫ్లైన్ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగుచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కోసం నియమించినట్లు ఆయన చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని నియమించామన్నారు. పటిష్ట బందోబస్తు కోసం 3,971 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. వీరితోపాటు పరీక్షా పత్రాలు, జవాబు పత్రాలు తదితర మెటీరియల్ను సురక్షితంగా తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను అనుసంధానించామన్నారు.
కాగా పలు సందేహాలు, అనుమానాల మధ్య ఎట్టకేలకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఈ రోజు జరగనుంది. ఓ వైపు ఎస్బీఐ క్లరికల్ పరీక్ష, మరోవైపు సన్నద్ధతకు మరింత సమయం కావాలంటూ అభ్యర్ధులు చేసిన విజ్ఞప్తులను కమిషన్ పటాపంచలు చేసింది. ఎస్బీఐ పరీక్షను మరో తేదీకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఇక సన్నద్ధతకు సమయం కావాలని వచ్చిన విజ్ఞప్తులపై కమిషన్ మొండి వైఖరి ప్రదర్శించింది. ముందుగా ప్రకటించిన ప్రకారంగానే ఫిబ్రవరి 25న పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న గ్రూప్ 2 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. మొత్తం 897 గ్రూపు-2 ఉద్యోగాలకు ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.