
కెరీర్లో త్వరగా స్థిరపడాలనుకునే యువతకు పాలిటెక్నిక్ కోర్సులకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. 2025-26 సంవత్సరానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ముగియడంతో పాలిసెట్ 2025కు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా నచ్చిన బ్రాంచిలో చేరే అవకాశం ఉంటుంది. డిప్లొమా పూర్తికాగానే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు వెంటనే లభిస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15, 2025వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
బయోమెడికల్, డీ ఫార్మసీ, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్, సీసీపీ, డీసీఈ, డీఎంఈ తదితర డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పదో తరగతి తరువాత తక్కువ కాలంలో కేవలం పాలిటెక్నిక్ కోర్సులతోనే కెరీర్లో స్థిరపడొచ్ఛు పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ రెండునుంచి ఉచితశిక్షణ, ఉచిత మెటీరియల్ ఇస్తామని పాలిసెట్ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఏసుదాస్ తెలిపారు.
పాలిసెట్కు దరఖాస్తులు చేసుకుంటున్న విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 99123 42048, వెంకటేశ్వరపురంలోని బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 99123 42016 నంబర్లు ఏర్పాటు చేశారు. కావలి, ఆత్మకూరు, కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుల్లో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎచ్చెర్ల మండలం కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏప్రిల్ 3 నుంచి పాలీసెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు స్థానిక పాలిటెక్నిక్ అధ్యాపకులు ప్రవేశ పరీక్షలో రాణించేలా వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణకు హాజరైన విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందజేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.