
అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల హాల్టికెట్లను విడుదల చేసింది. విద్యార్ధులు తమ జిల్లా, స్కూల్, విద్యార్థి పేరు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వనమిత్ర వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవ్చని అధికారులు తెలిపారు. కాగా ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
మరోవైపు సోమవారం (ఫిబ్రవరి 23) నుంచి ఇంటర్ రెగ్యులర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రెగ్యులర్ విద్యార్ధులతోపాటు ఓపెన్ స్కూల్ విద్యార్ధుల హాల్ టికెట్లను కూడా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో, వనమిత్ర వాట్సప్ గ్రూపుల్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వాట్సప్ 95523 00009 నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ‘Education services’ లోకి వెళ్లి ‘IPE 2026 Hall Ticket’ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో విద్యార్ధులు తమ వివరాలు సమర్పిస్తే హాల్టికెట్ వాట్సప్కే నేరుగా వస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్షలు రాయవచ్చు.
అలాగే ఈ రోజు నుంచి మొదలయ్యే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్కు బదులుగా 32 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. పరీక్షలో ఇక అదనంగా Additional sheets ఇవ్వరు. విద్యార్ధులు అన్ని సమాధానాలు ఈ బుక్ లెట్లోనే రాయవల్సి ఉంటుంది. అన్ని పరీక్షలకు ఇదే విధంగా 32 పేజీల బుక్ లెట్ను అందజేస్తారు. మొదటి ఏడాది విద్యార్థులకు సిలబస్తో పాటు ప్రశ్నపత్రాల విధానంలోనూ మార్పులు చేసిన కారణంగా బుక్లెట్ పేజీల సంఖ్యను పెంచారు. అయితే సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం గతేడాది మాదిరిగానే 24 పేజీల బుక్లెట్ అందజేస్తారు. విద్యార్ధులు ఈ మార్పులను గమనించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.