NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌!

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పాత వన్‌టైమ్ వెబ్ ఆప్షన్ల విధానాన్ని రద్దు చేసి, ఇకపై ప్రతి విడత కౌన్సెలింగ్‌కు విద్యార్థులు తమ కాలేజీ ఎంపికలను మార్చుకునే అవకాశం కల్పించింది. సీటు వచ్చిన తర్వాత చేరని అభ్యర్థులకు కూడా మరో అవకాశం ఇచ్చింది..

NEET అభ్యర్థులకు అలర్ట్.. MBBS, BDS కౌన్సెలింగ్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన AP సర్కార్‌!
AP MBBS BDS Counselling Rules

Updated on: Jul 30, 2026 | 5:05 PM

అమరావతి, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. MBBS, BDS అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అమలులో ఉన్న కౌన్సెలింగ్ విధానాన్ని సవరించింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (UG Medical and Dental Professional Courses Admissions) Rules, 2004 లో మార్పులు చేశారు. గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం MBBS, BDS ప్రవేశాలకు అభ్యర్థులు అందుబాటులో ఉన్న అన్ని సీట్లకు ఒకేసారి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండేది. అలాగే MBBS, BDS కోర్సులకు వేర్వేరు కౌన్సెలింగ్ నిర్వహించేవారు. కేటాయించిన సీటులో చేరని అభ్యర్థులకు తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ఈ విధానం 2020-21 నుంచి 2024-25 విద్యా సంవత్సరాల వరకు సమర్థవంతంగా పనిచేసినప్పటికీ, 2025-26లో కొన్ని పరిపాలనా సమస్యలు ఎదురయ్యాయి.

మార్పులకు కారణాలు

నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం, కొన్ని కాలేజీల అనుమతులను పునరుద్ధరించడం, సీట్ల సంఖ్య పెంచడం వంటి నిర్ణయాలు కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత జరిగాయి. దీంతో కొత్త సీట్లు తరువాతి దశల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీని కారణంగా కొత్త నోటిఫికేషన్లు, కొత్త వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అవసరమైంది. ఇది అప్పటి ఒకేసారి ఆప్షన్లు ఇచ్చే విధానంతో సరిపోలలేదు. అంతేకాకుండా ఈ విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు మధ్యంతర పరిశీలనల్లో అభ్యర్థులు అన్ని కాలేజీలను తప్పనిసరిగా ఎంపిక చేయాల్సిన అవసరం లేదని సూచించింది. తెలంగాణలో కూడా ఇలాంటి విధానాన్ని నిలిపివేసి ప్రతి దశలో కొత్త వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.

కొత్త విధానంలో చేసిన మార్పులు ఇవే

ప్రభుత్వం కొత్త సవరణల ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి దశ కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలలోని MBBS, BDS సీట్లకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. కౌన్సెలింగ్ సమయంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్లను కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు ఎక్కువ కాలేజీలు, కోర్సులను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. సీట్ల లభ్యత ఆధారంగా సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. సీటు వచ్చిన తర్వాత చేరని అభ్యర్థులకు సైతం మరో కొత్త నిబంధన తీసుకువచ్చింది. పాత విధానంలో అయితే సీటు కేటాయించిన తర్వాత చేరని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనలేరు. అయితే తాజా మార్పుల ప్రకారం అభ్యర్థి కేటాయించిన కాలేజీలో చేరకపోతే, తదుపరి దశల్లో అదే కాలేజీకి మాత్రమే మళ్లీ ఆప్షన్ ఇవ్వడానికి అనర్హత ఉంటుంది. అయితే ఇతర కాలేజీల ఎంపికకు అవకాశం కొనసాగుతుంది.

ఈ మార్పుల వల్ల వైద్య విద్య అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్తగా మంజూరయ్యే మెడికల్ కాలేజీల సీట్లు కూడా కౌన్సెలింగ్‌లో చేరే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ప్రతి దశలో తమ నిర్ణయాలను మార్చుకునే అవకాశం పొందుతారు. సీట్ల భర్తీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా జరుగుతుంది. విద్యార్థులకు మెరుగైన ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం MBBS, BDS ప్రవేశాల కౌన్సెలింగ్ విధానంలో ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు. ఒకేసారి వెబ్ ఆప్షన్ల విధానానికి బదులుగా ప్రతి దశ కౌన్సెలింగ్‌కు ముందు ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశ్యం.

Loading...
Unable to load recommendations.
Follow Us