లక్షలాది విద్యార్థుల ఉత్కంఠకు తెర.. AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన

AP EAPCET 2026 Result Date and Time: రాష్ట్ర ఈఏపీసెట్‌ 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలను జూన్‌ 30లోగా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటం, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుండటంతో రిజల్ట్స్‌ విడుదల ఆలస్యమైంది. ఈ ఏడాది 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, ఎవరూ అన్యాయం పాలుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్తగా ఫలితాల ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు..

లక్షలాది విద్యార్థుల ఉత్కంఠకు తెర.. AP EAPCET 2026 ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన
AP EAPCET Result Date and time

Updated on: Jun 25, 2026 | 7:00 AM

అమరావతి, జూన్‌ 25: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) ఫలితాలను జూన్ 30లోగా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్‌సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 1 నాటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఫలితాల ప్రకటన ఆలస్యమైంది. ఎప్‌సెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో ఇంటర్ ఫలితాల ప్రక్రియ పూర్తికావడం కోసం అధికారులు వేచి చూశారు.

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎవరూ ర్యాంకుల విషయంలో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈఏపీసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేసింది. మరోవైపు, సీబీఎస్‌ఈ 12వ తరగతి సమాధాన పత్రాల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ఫలితాలను జూన్ 21 నాటికి 85 శాతానికి పైగా విడుదల చేసింది. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఈఏపీసెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది సుమారు 8 వేల మంది సీబీఎస్‌ఈ విద్యార్థులు ఈఏపీసెట్ పరీక్ష రాశారు. ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా పరవాలేదు కానీ, ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సూచించినట్లు ఎప్‌సెట్ ఛైర్మన్ వెల్లడించారు. కాగా, మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం ర్యాంకులు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us