AP EAPCET 2026 Results: విద్యార్ధులకు అలర్ట్.. ఈఏపీసెట్ ఫలితాలు మరింత ఆలస్యం! కారణం ఇదే
AP EAMCET 2026 Results Postponed: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈఏపీసెట్ ర్యాంకులు ప్రకటించగా.. ఏపీలో మాత్రం విద్యార్ధులకు ఎదురు చూపులు తప్పడం లేదు. జూన్ నెలారంభంలోనే విడుదల కావల్సిన ఈఏపీసెట్ ఫలితాలు వాయిదాపడ్డాయి. పలు కారణాల వల్ల వీటిని మరింత ఆలస్యంగా విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు..

అమరావతా, జూన్ 1: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్సెట్ ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కరమంలో ఈ పరీక్షలు ముగిసే వరకు ఈఏపీసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉన్నందున ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేంత వరకు ఈ ప్రక్రియ వాయిదా పడనుంది.
తాజా ప్రకటన మేరకు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 18 తర్వాత విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చినందున సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఈ ఏడాది కూడా అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాంకుల్లో మార్పు వచ్చే అవకాశం ఉన్నందున ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల తర్వాతే ఈఏపీసెట్ ర్యాంకులు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తుంది.
సాధ్యమైనంత వరకు త్వరగానే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఏడది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాస్తున్న విద్యార్ధులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.50 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఒక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మాత్రమే ఏకంగా లక్ష మంది వరకు రాస్తున్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీతో ముగుస్తాయి. ఆ తర్వాత మూల్యాంకనం ప్రక్రియ రెండు వారాల పాటు కొనసాగుతుంది. సప్లిమెంటరీ ఫలితాలు జూన్ మూడో వారంలో విడుదల చేస్తారు. అదే వారంలో ఈఏపీసెట్ ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
