
అమరావతి, ఫిబ్రవరి 6: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు షెడ్యూల్ ప్రకారం మార్చి 7, 2026వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో మార్చి 12 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో మార్చి 17 వరకు, రూ.4వేల ఆలస్య రుసుముతో మార్చి 21 వరకు, రూ.10వేల ఆలస్య రుసుముతో మార్చి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అనంతరం దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మార్చి 26 నుంచి 28 వరకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్ 28 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో జరుగుతాయి. ఇక వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. అనంతరం మే 23న ప్రాథమిక ‘కీ’ విడుదల అవుతుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను మే 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 1వ తేదీన ప్రకటిస్తారు. కాగా ఈ ఏడాది కూడా జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలోనే ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ కూడా మార్చి 2వ తేదీతో ముగుస్తుంది. ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు దరఖాస్తుకు అవకాశం ఇస్తారు. ఏప్రిల్ 9 నుంచి హాల్టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 23న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ‘కీ’ని ఏప్రిల్ 27న విడుదల చేసి, మే 7న ఫలితాలు ప్రకటిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.