
అమరావతి, ఆగస్ట్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేయనున్నారు. డిగ్రీ ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను హెల్ప్డెస్క్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
విద్యార్థులకు ఆగస్టు 27 నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియలను పూర్తి చేయాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది. విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలు, కౌన్సెలింగ్ మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.