
అమరావతి, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కూటమి సర్కార్ 2026 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హోలీ, రంజాన్ పండగల సెలవు రోజుల్లో వస్తున్న ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని, ఆయా తేదీల్లో యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ, సివిక్స్ పేపర్ 2 పరీక్షలు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3న జరగాల్సి ఉంది. మార్చి 3న హోలీ పండగ ఉండటంతో ఈ పరీక్షలను మార్చి 4కు మార్చారు. మార్చి 20న జరగాల్సిన మొదటి ఏడాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పరీక్షలు మార్చి 20న జరగాల్సి ఉండగా.. ఈ రోజు రంజాన్ పండగ సెలవు వచ్చింది. దీంతో ఈ పరీక్షలను మార్చి 21వ తేదీకి సవరించారు. ఈ మేరకు టైం టేబుల్లో మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మారడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడంతో ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ సబ్జెక్టులకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చారు. నైతికత, మానవ విలువల పరీక్షలు జనవరి 21న, పర్యావరణ పరీక్ష జనవరి 23న నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.