అమరావతి, జూన్ 11: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావు సంయుక్తంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఈఏపీసెట్ను జేఎన్టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాల ప్రకటనల అనంతరం అధికారిక వెబ్సైట్లో ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈఏపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్ వెయిటేజీ మార్కులు రెండింటి ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలతోపాటు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది.