అమరావతి, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం (జూన్ 24) కొలువైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి ఐదు సంతకాలకు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వాటిల్లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ కూడా ఉంది. మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టుల భర్తీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
ఈ రోజు జరిపిన చర్చల్లో కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై మంత్రి వర్గం చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను కూడా అధికారులు క్యాబినెట్లో చర్చించారు. జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు ముగిసేలా ప్రణాళికను రూపొందించారు. ఇక ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించడంతో జులై 1 నుంచి మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభంకానుంది. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా.. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా అది వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.