హైదరాబాద్, ఆగస్టు 4: తెలుగు రాష్ట్రాల నీట్ యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు తాజాగా విడుదలయ్యాయి. జులై 26న నీట్ యూజీ సవరించిన ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐదు మార్కుల కోత విధించడంతో అభ్యర్ధుల ర్యాంకుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లోనూ పలువురు ర్యాంకు కోల్పోయారు. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి ర్యాంకులను విడుదల చేసింది. అలాగే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా కేంద్ర ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆగస్టు 14 నుంచి ఎంబీబీఎస్ 2024-25 అకడమిక్ సెషన్ ప్రారంభం అవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఆగస్టు తొలి వారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ సంస్థ ప్రకటించిన తేదీల్లోనే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్లను నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 710 మెడికల్ కాలేజీల్లో 1.10 లక్షల వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఆల్ ఇండియా కోటా కింద ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. వీటితోపాటు 21 వేల బీడీఎస్ సీట్లు, ఆయుష్, నర్సింగ్ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఆలిండియా కోటాలో 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్మర్లోని ఎంబీబీఎస్ సీట్లను కూడా భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ నీట్-యూజీ 2024 రాష్ట్ర ర్యాంకుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ నీట్-యూజీ 2024 రాష్ట్ర ర్యాంకుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీట్ యూజీలో మొత్తం 720 మార్కులకు గానూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 162 మార్కులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులను కటాఫ్గా ప్రకటించారు. మొత్తం 43,788 మంది ర్యాంకులను ప్రకటించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. తెలంగాణలో అన్ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 162 మార్కులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127 మార్కులు, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్గా ప్రకటించారు. ఆ ప్రకారంగా మొత్తం 49,143 మందికి ర్యాంకులు ఇచ్చినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది.