Success Story: అంధత్వాన్ని వెనక్కినెట్టి.. ఆత్మవిశ్వాసంతో APPSC గ్రూప్‌ 2లో మెరిసిన యువకుడు!

ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం కూడా ఓడిపోయింది. రోడ్డు ప్రమాదంలో కంటిచూపు కోల్పోయి.. కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకుంటూ చదువు సాగించాడు. గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగిన ఆ యువకుడు గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు..

Success Story: అంధత్వాన్ని వెనక్కినెట్టి.. ఆత్మవిశ్వాసంతో APPSC గ్రూప్‌ 2లో మెరిసిన యువకుడు!
visually impaired man secured APPSC group 2 Job

Edited By:

Updated on: Feb 06, 2026 | 3:49 PM

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు శివరామదుర్గాపురంకు చెందిన నందం నాగరాజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్ఓడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరనున్నాడు. గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ముందుకుసాగిన ఆ యువకుడు గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు.

2010 లో హైదరాబాద్ లో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు కంటి చూపును కోల్పోయాడు. అప్పుడు చల్లపల్లి రాజా హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఒక కంటికి మూడు సార్లు శస్త్రచికిత్స చేసినా కన్ను తిరిగి రాలేదు. మరో కంటిచూపు సైతం క్రమేపీ తగ్గిపోయింది. ఐదేళ్లు ఇంటి వద్దే ఉన్న నాగరాజు కంటిచూపు లేదనే ఆలోచన మనసులోకి రానీయకుండా 2015లో ఒంగోలులోని బ్లైండ్ హాస్టల్‌లో చేరాడు. అక్కడే ఉంటూ 78 శాతం మార్కులతో పదవ తరగతి పాసైయ్యాడు. 86 శాతంతో ఇంటర్మీడియట్, 80 శాతంతో డిగ్రీ, 75 శాతంతో ఎంఏ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ కళాశాల ఫస్టు రావడంతో 2018 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు, ల్యాప్టాప్, గోల్డ్‌ మెడల్, రూ.20వేల నగదు అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

2022లో ఎంఏ చదువుతూ పోటీ పరీక్షలు రాయటం మొదలుపెట్టాడు. గ్రూప్-2 రాసేందుకు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో స్క్రైబ్ (సహా యకుడు) సహాయంతో గ్రూప్-2 పరీక్ష రాశాడు. చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన కుమారుడికి తల్లి నందం వెంకటేశ్వరమ్మ అండగా నిలిచింది. సాలిపేట ఎంపీయూపీ పాఠశాలలో ఆమె వంట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తండ్రి మోహనరావు 2018లో విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. నాగరాజుకు అక్క, తమ్ముడు ఉన్నారు. తమ్ముడు చదువు మానేసి బేకరీలో పనికి వెళ్తున్నాడు. అక్కకు వివాహం చేశారు. తండ్రి మరణించినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న భీమా ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేల పింఛను, తల్లి కుకింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.