
కొల్హాపూర్-సింధుదుర్గ్ సరిహద్దుకు సమీపంలోని గగన్బావడా తాలూకాలో ఉన్న కావల్టేక్ ధంగర్వాడా అనే మారుమూల ప్రాంతంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉంది. ఈ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేదు. సమీపంలోని రహదారి నుంచి పాఠశాల సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో మిథారి ప్రతిరోజూ అంత దూరం అడవిలో నడిచి పాఠశాలకు చేరుకుంటారు. అంటే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు 2.5 కిలోమీటర్లు.. తిరిగి ఇంటికి చేరేందుకు మరో 2.5 కిలోమీటర్లు. ఇలా రోజుకు దాదాపు 5 కిలోమీటర్ల ప్రయాణం ఆయన దినచర్యలో భాగమైంది. వర్షాకాలంలో ఈ ప్రయాణం మరింత కష్టంగా మారుతుంది. భారీ వర్షాలు, బురద, రహదారి లేకపోవడంతో పాటు అడవి జంతువుల సంచారం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.
జీవన్ మిథారి 2013 జూలై 26న ఈ పాఠశాలలో విధుల్లో చేరారు. అప్పటి నుంచి గత 13 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. ఈ పోస్టింగ్ను ఆయనకు బలవంతంగా కేటాయించలేదు. స్వయంగా ఈ మారుమూల పాఠశాలను ఎంచుకున్నారు. అప్పట్లో ఆయన కొల్హాపూర్ జిల్లా ప్రాథమిక ఉపాధ్యాయుల సహకార బ్యాంకుకు చైర్మన్గా కూడా పనిచేశారు. ప్రభావవంతమైన పదవుల్లో ఉన్నవారు సాధారణంగా సౌకర్యవంతమైన పోస్టింగులు పొందుతారని, కష్టమైన ప్రాంతాల్లో పనిచేసేది ఇతరులేనని కొందరు సహచరులు వ్యాఖ్యానించినప్పటికీ.. మిథారి మాత్రం సవాలుతో కూడిన ఈ పాఠశాలను ఎంచుకున్నారు. ఒకప్పుడు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉండేది. అయితే మెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామంలోని అనేక కుటుంబాలు కొల్హాపూర్ నగరానికి వలస వెళ్లాయి. దీంతో గ్రామ జనాభా తగ్గిపోయింది. విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న స్వర బోడకే మాత్రమే అధికారికంగా విద్యార్థిగా ఉంది. గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో స్వర చెల్లెలు కూడా పాఠశాలకు వచ్చి తరగతులు వింటోంది.
విద్యార్థులు తగ్గిపోయారని పాఠశాలకు వెళ్లడం మానేయాలని మిథారి ఎప్పుడూ అనుకోలేదు. ‘ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నా.. నా పని నేను కొనసాగించాలి’ అనేది ఆయన భావన. విద్యార్థుల సంఖ్య కంటే వారికి విద్య అందించాల్సిన బాధ్యతే ముఖ్యమని ఆయన నమ్ముతారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే పిల్లలకు కూడా విద్య అందేలా చూడటం తన బాధ్యతగా భావిస్తున్నారు. మిథారి ప్రతిరోజూ ప్రయాణించే ప్రాంతంలో గౌర్లు, చిరుతపులులు వంటి అడవి జంతువులు సంచరిస్తుంటాయి. ప్రయాణ సమయంలో ఆయనకు గౌర్లు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలో స్థానిక గ్రామస్థులు ఆయనకు సూచనలు ఇచ్చారు. ఇటీవల గ్రామానికి సమీపంలో ఓ చిరుతపులి పశువులపై దాడి చేసిన ఘటన కూడా జరిగింది. దీంతో అడవిలో ఆయన ప్రయాణించే సమయంలో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. కొన్నిసార్లు భయంగా అనిపించినా.. ఇప్పుడు ఈ ప్రయాణం తన రోజువారీ జీవితంలో భాగమైపోయిందని మిథారి చెబుతున్నారు.
ఒక్క విద్యార్థి కోసం ప్రతిరోజూ అడవిలో కిలోమీటర్ల మేర నడిచి వెళ్లే జీవన్ మిథారి కథ.. ఉపాధ్యాయ వృత్తిలోని బాధ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో తన బాధ్యతను విస్మరించకుండా, మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక్క చిన్నారికి కూడా విద్య అందించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రత్యేకంగా నిలుస్తోంది. విద్య అనేది అందరికీ అందాల్సిన హక్కు. ఆ హక్కు మారుమూల ప్రాంతాల్లోని ఒక్క చిన్నారికి కూడా అందేలా చేయడమే తన బాధ్యతగా భావిస్తున్న జీవన్ మిథారి.. నిజమైన ఉపాధ్యాయ అంకితభావానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.