
బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్లపై ఆందోళనలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో పసిడి ధరలు మూడు మాసాల గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టాలా? లేక త్వరలోనే ధరల్లో కరెక్షన్ వస్తుందా? అనే అంశంపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంటోంది. స్పాట్ గోల్డ్ మంగళవారం ఔన్స్కు 4,668 అమెరికా డాలర్లకు పైగా చేరగా, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4,700 డాలర్లను దాటాయి. మే నెల మధ్యలో బంగారం ధర రికార్డు గరిష్ఠ స్థాయిని ఇప్పుడు పసిడి ధరలు మళ్లీ చేరుకున్నాయి.
అయితే బంగారం ర్యాలీ కొనసాగుతున్న సమయంలోనే ఆప్షన్స్ మార్కెట్లో జరిగిన భారీ ట్రేడ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం అమెరికా మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక ఇన్వెస్టర్ SPDR Gold Shares ETF (GLD)లో దాదాపు 1.16 లక్షల ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడ్ చేశారు.
ఈ ట్రేడ్లో సెప్టెంబర్ 18 గడువు ఉన్న 420 డాలర్ల స్ట్రైక్ ధర కలిగిన దాదాపు 1.16 లక్షల కాల్స్ను విక్రయించి సుమారు 202 మిలియన్ డాలర్ల ప్రీమియం పొందారు. అదే సమయంలో 430 డాలర్ల స్ట్రైక్ ధర కలిగిన అదే సంఖ్యలో కాల్స్ను సుమారు 144 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంతో దాదాపు 58 మిలియన్ డాలర్ల నెట్ క్రెడిట్ వచ్చింది. ఈ పొజిషన్ను స్వల్పకాలికంగా బంగారం ధరలపై ప్రతికూల అంచనాగా చూడవచ్చు.
బంగారం ధరలు తగ్గుతాయనే సంకేతమా?
ఈ భారీ ఆప్షన్స్ ట్రేడ్ బంగారం ఒక్కసారిగా కుప్పకూలుతుందనడానికి సంకేతం కాదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇటీవలి వేగవంతమైన ర్యాలీ తర్వాత స్వల్పకాలికంగా పసిడి ధరల్లో కరెక్షన్ రావచ్చని కొందరు మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ట్రేడ్లో దాదాపు 425 డాలర్ల వద్ద బ్రేక్ ఈవెన్ స్థాయి కనిపిస్తోంది.
మరోవైపు బంగారానికి మద్దతుగా ఉన్న ప్రాథమిక అంశాలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా రుణభారం, డాలర్పై ఆందోళనలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు పసిడి ధరల దిశను ప్రభావితం చేసే అవకాశముంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధిక స్థాయిలో బంగారం కొనుగోలు చేయడం ప్రమాదకరమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారు తమ పొజిషన్ను కొనసాగించవచ్చని, కొత్త పెట్టుబడిదారులు ధరలు తగ్గినప్పుడు విడతల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
(గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి మారుతాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)