Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? ఎవరు ఫిక్స్ చేస్తారు..? ఎవరికీ తెలియని అసలు లెక్కలివే..

పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల పెరిగాయి. రూ.7.50 మేర కేంద్ర ప్రభుత్వం పెంచింది. అయితే త్వరలో మరోసారి పెరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంచితే.. పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు.. ఎవరు నిర్ణయిస్తారు అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి.

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..? ఎవరు ఫిక్స్ చేస్తారు..? ఎవరికీ తెలియని అసలు లెక్కలివే..
Petrol Diesel Price

Updated on: Jul 22, 2026 | 1:59 PM

హర్ముజ్ జలసంధి మళ్లీ మూసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టి రెండు దేశాలు మళ్లీ యుద్దానికి దిగడంతో పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతుండగా.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయనే చర్చ ఊపందుకుంది. ముడి చమురు నుంచే పెట్రోల్, డీజిల్ తయారుచేస్తారు. దాని ధర పెరిగితే ఇంధన ధరలు పెరుగుతాయి. అయితే ఈ ప్రభావం భారతదేశంలో వెంటనే కనిపించదు. దీని వెనుక అనేక కారణాలు అనేవి ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఖర్చుల ఆధారంగా లెక్కింపు..

భారతదేశం ఎక్కువగా ముడి చమురును డాలర్లలో దిగుమతి చేసుకుంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడితే.. దిగుమతుల విలువ పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ముడి చమురు చౌకగా లభించినా.. ఇంధన ధరలు తగ్గవు. ధరలను నిర్ణయించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ముడి చమురు ద్వారా పెట్రోల్, డీజిల్‌ తయారీకి రీఫైనరీలకు కొంత ఖర్చు అవుతుంది. రిఫైనరీల నుండి దేశవ్యాప్తంగా ఉన్న డిపోలు, పెట్రోల్ పంపులకు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు రవాణా ఖర్చులు అవుతాయి. ఇక చమురు మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు, డీలర్ కమిషన్లను పరిగణలోకి తీసుకుని ధరలను నిర్ణయిస్తారు. పెట్రోల్ పంపు ఆపరేటర్లు అమ్మే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఒక స్థిరమైన కమీషన్‌ అందుతుంది. వినియోగదారుడు చెల్లిస్తే ధరలో దీనిని కలుపుతారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం

ఇక కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వ్యాట్, ఇతర పన్నులు విధిస్తాయి. ప్రతి రాష్ట్రం స్వంత వ్యాట, ఇతర స్థానిక పన్నులను విధిస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇక ముడి చమురు సెస్, కస్టమ్స్ సుంకాలు, ఐజీఎస్టీ, సీజీఎస్టీ, రాయల్టీలు, ఇతర రుసుములు ధరలను నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది.  అయితే ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గవు. ఎందుకంటే ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కేవలం అంతర్జాతీయ ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవు. పన్నులు, రూపాయి విలువ, గతంలో కొనుగోలు చేసిన ఖరీదైన ముడిచమురు నిల్వలు, శుద్ధి ఖర్చులు, ప్రపంచ అనిశ్చితులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మరికొన్నిసార్లు చమురు కంపెనీలు పాత నిల్వలు అయిపోయే వరకు వేచి ఉంటాయి. అందువల్ల ధరలు వెంటనే తగ్గవు. కేంద్ర ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వీటిని పరిగణలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తాయి.

Follow Us