
Gold Import: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు కీలక విన్నపం చేశారు. రాబోయే ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని, పెట్రోల్-డీజిల్ ఆదా చేయాలని, సాధ్యమైనంత వరకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయాలని ఆయన కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ప్రపంచంలో చైనా తర్వాత బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే దేశం భారత్. మన సంప్రదాయంలో బంగారం అంతర్భాగం. అయితే, మన దేశంలో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. అందుకే మనం దాదాపు 800 నుండి 900 టన్నుల వార్షిక అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.
ఇది కూడా చదవండి: India Gold Ban: బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తుందా? అసలు నియమాలు ఏమిటి?
‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ (WGC) నివేదిక ప్రకారం, భారత్లో ప్రతిరోజూ సగటున 2.2 టన్నుల బంగారం విక్రయం జరుగుతోంది. దీని విలువ సుమారు రూ. 2000 నుండి 2200 కోట్ల వరకు ఉంటుంది. 2024 గణాంకాల ప్రకారం.. మొత్తం 724 టన్నుల దిగుమతుల్లో 563 టన్నులు కేవలం ఆభరణాల రూపంలోనే అమ్ముడయ్యాయి.
ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి 11 నెలల్లోనే భారత్ బంగారం దిగుమతి కోసం రూ. 6 లక్షల కోట్లు ($69 బిలియన్లు) ఖర్చు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 29% ఎక్కువ. బంగారం కొనడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లించాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుంది. భారీ దిగుమతుల వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD) పెరుగుతోంది. ప్రజలు బంగారంపై పెట్టే పెట్టుబడిని బ్యాంకులు, షేర్లు లేదా బాండ్లలో పెడితే, ఆ డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి