Budget: 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌.. అత్యధిక రికార్డ్‌ ఎవరిది?

Union Budget 2026: ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోవసారి. మరి స్వాతంత్ర్యం నాటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారో చూద్దాం..

Budget: 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్‌.. అత్యధిక రికార్డ్‌ ఎవరిది?
Budget 2026

Updated on: Feb 01, 2026 | 11:14 AM

Budget 2026: సాధారణ బడ్జెట్ సమర్పణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామణ్ సమర్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవ బడ్జెట్ ఇది. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో వరుసగా ఇన్ని బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రి సీతారామన్. కానీ స్వతంత్ర భారతదేశపు మొదటి సాధారణ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారో.. ఏ ఆర్థిక మంత్రి దానిని అత్యధిక సార్లు ప్రవేశపెట్టారో మీకు తెలుసా? బడ్జెట్ చరిత్రకు సంబంధించిన ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..

స్వతంత్ర భారతదేశపు తొలి బడ్జెట్‌:

ఇక స్వతంత్ర భారతదేశపు తొలి బడ్జెట్‌ను బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టారు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ఏప్రిల్ 7, 1860న ప్రవేశపెట్టి ప్రసంగించారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత భారతదేశపు తొలి బడ్జెట్‌ను భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి నవంబర్ 26, 1947న ప్రవేశపెట్టారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది, ప్రఖ్యాత ఆర్థికవేత్త.

మొరార్జీ దేశాయ్ (పది సార్లు బడ్జెట్):

మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధిక బడ్జెట్‌లను సమర్పించిన రికార్డును కలిగి ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మొత్తం 10 బడ్జెట్‌లను సమర్పించారు. 1959- 1964 మధ్య ఆరు బడ్జెట్‌లను, 1967 – 1969 మధ్య నాలుగు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించారు.

పి. చిదంబరం, నిర్మలాసీతారామన్ (తొమ్మిది సార్లు బడ్జెట్‌)

మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  అలాగే నిర్మలాసీతామన్ ఇప్పుడు 9వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. చిదంబరం తొలి బడ్జెట్‌ను మార్చి 19, 1996న ప్రధానమంత్రి హెచ్‌డి దేవెగౌడ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. రెండవ బడ్జెట్‌ను కూడా అదే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. 2004 – 2008 మధ్య ఆయన ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో ఆయన మళ్లీ ఆర్థిక మంత్రి అయ్యారు. అలాగే 2013 – 2014లో దేశ సాధారణ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుండి భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి, ఒక తాత్కాలిక బడ్జెట్‌తో సహా మొత్తం తొమ్మిది సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

ప్రణబ్ ముఖర్జీ (8 సార్లు)

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిది బడ్జెట్ ప్రసంగాలు చేశారు. ఆయన మొదట 1982, 1983, 1984లో మూడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆపై కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2009 – మార్చి 2012 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్ (ఐదు సార్లు)

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఐదు బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1991 – 1995 మధ్య వరుసగా ఐదు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి