
రైళ్లల్లో సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ అనేక నిబంధనలు అమలు చేస్తోంది. ప్రయాణికులకు రైళ్లల్లో అనేక రూల్స్ వర్తింపచేస్తోంది. ఏ టికెట్తో ఏ కోచ్లో ప్రయాణం చేయాలి..? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఏం చేయాలి? జనరల్ టికెట్ ఉన్న ప్రయాణికులు ఏ కోచ్లో ప్రయాణం చేయాలి? అనే విషయంపై అనేక నిబంధనలు ఉన్నాయి. కొంతమందికి వీటి గురించి అవగాహన లేకపోవడంతో తాము టికెట్ తీసుకున్న కోచ్లో కాకుండా వేరే కోచ్లో ప్రయాణిస్తుంటారు. టీటీఈలకు పట్టుబడి జరిమానా విధిస్తారు. కొంతమంది జనరల్ లేదా వెయిటింగ్ లిస్టు టికెట్తో స్లీపర్ కోచ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలా చేయవచ్చా..? చేస్తే ఏమవుతుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు టికెట్ కన్పార్మ్ కాని సమయంలో చాలామంది జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమంది జనరల్ టికెట్తో స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం రైల్వే నిబంధనలకు విరుద్దం. ఏ క్లాస్ టికెట్ తీసుకుంటే అదే క్లాసులో ప్రయాణం చేయాలి. జనరల్ టికెట్లతో కేవలం రిజర్వేషన్ లేని కోచ్లలో మాత్రమే ప్రయాణం చేయాలి. స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు రిజర్వేషన్ అవసరం. ఒకవేళ ఈ క్లాసుల్లో టికెట్లు ఖాళీగా ఉంటే టీటీఈకు అదనంగా కొంత చెల్లించి టికెట్ను అప్ గ్రేడ్ చేయించుకోవాలి. ఇక వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే జనరల్ కోచ్లో ప్రయాణం చేయవచ్చు. కానీ రిజర్వుడ్ కోచ్లలో ప్రయాణం చేయడానికి వీలు పడదు. ఈ విషయం చాలామందికి తెలియక నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ కోచ్లో ప్రయాణం చేస్తే రూ.250 జరిమానా ఉంటుంది. ఇక ఏసీ కోచ్లో ప్రయాణిస్తే రూ.440 వరకు ఉంటుంది. ఆ తర్వాతి స్టాఫ్లో జనరల్ కోచ్లోకి వెళ్లమని ఆదేశిస్తారు. రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు ఈ నిబంధనల గురించి తెలుసుకోవాలి. లేకపోతే భారీగా జరిమానా పడటంతో పాటు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. దీంతో ప్రయాణం చేసే సమయంలో రైల్వే నిబంధనల గురించి ముందే తెలుసుకోవాలి. దీని వల్ల అవాంతరాలు లేని ప్రయాణం చేయవచ్చు.