ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? పెద్ద మొత్తంలో ఏదైనా మంచి వడ్డీరేటు వచ్చే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకండి. అవకాశం ఉన్నంత వేగంగా డిపాజిట్ చేయండి. అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పుడే మంచి రాబడిని పొందుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈ ఏడాది చివరి నాటికి రెపో రేటును తగ్గించాలని భావిస్తోంది. అదే జరిగితే అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మళ్లీ సవరిస్తాయి. అప్పుడు రేటు తగ్గే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుత అధిక వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవాలని, పెట్టుబడిదారులు ఇప్పుడే తమ పెట్టుబడులను ఫిక్స్డ్ డిపాజిట్లలో(ఎఫ్డీలలో) లాక్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లకు వచ్చే సరికి అన్ని చోట్ల ఒకే రకమైన వడ్డీ రేటు ఉండదు. బ్యాంకులను బట్టి, కాల వ్యవధులను బట్టి మారుతుంటుంది. ఒకవేళ ఆర్బీఐ ఈ ఏడాదిలోనే రెపో రెటును తగ్గిస్తే.. బ్యాంకులు కూడా వెంటనే తమ బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ప్రస్తుతం ఎఫ్డీలపై బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్న నేపథ్యంలో దానిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీరు ఒకవేళ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నా.. ముందు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లను సరిచూసుకోవాల్సి ఉంటుంది. మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్న మొత్తం, కాల వ్యవధి ఆధారంగా బ్యాంకును ఎంచుకోవాలి. మీరు ఒక సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలనే ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ కథనం మీకు బాగా ఉపకరిస్తుంది. దీనిలో ఒక ఏడాది కాలానికి అధిక వడ్డీని అందించే టాప్ బ్యాంకులను మీకు పరిచయం చేస్తున్నాం. ఓ లుక్కేయండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐలో సాధారణ పౌరులకు 1-సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఇవి మే 15, 2024 నుంచి అమల్లోకి వచ్చిన తాజా వడ్డీ రేట్లు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్డీఎఫ్సీ సాధారణ పౌరులకు తన ఒక-సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్పై వార్షిక వడ్డీ రేటును 6.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ తేదీలు అమల్లోకి వచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ 1-సంవత్సరం ఎఫ్డీపై 6.7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.2 శాతం అందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్పై 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం అందిస్తోంది. తాజా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 27, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ): ఈ రుణదాత సాధారణ పౌరులకు ఒక సంవత్సర కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ రేట్లు జనవరి 15, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..