
బంగారం సాధారణంగా నీరు, గాలి లేదా ఇతర ఆమ్లాలతో త్వరగా స్పందించదు. అందుకే అది వేల ఏళ్లయినా మెరుస్తూనే ఉంటుంది. బంగారం సాధారణంగా తుప్పు పట్టదు లేదా ఇతర రసాయనాలతో అంత త్వరగా స్పందించదు. కానీ, పాదరసంతో మాత్రం దీనికి శతృత్వం ఉంటుంది. పాదరసం బంగారంతో తగిలిన వెంటనే దానిని తనలో కలిపేసుకుంటుంది. పాదరసం (Mercury) ద్రవ రూపంలో ఉండే ఒక వింత లోహం. ఇది బంగారంతో తగిలిన వెంటనే అమల్గమేషన్ అనే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది ఎంత వేగంగా జరుగుతుందంటే, సెకన్ల వ్యవధిలోనే బంగారం తన రూపాన్ని మార్చుకుంటుంది.
ఏం జరుగుతుంది?: బంగారు ఆభరణాలపై పాదరసం పడగానే ఆ భాగం తెల్లగా మారిపోతుంది. చాలామంది ఇది వెండి అని లేదా రంగు పోయిందని భ్రమపడతారు. కానీ, నిజానికి అక్కడ బంగారం పాదరసంతో కలిసి ఒక కొత్త మిశ్రమంగా మారిపోయింది. పాదరసం బంగారం పరమాణువుల మధ్యలోకి చొచ్చుకుపోతుంది. దీనివల్ల ఆభరణం తన దృఢత్వాన్ని కోల్పోయి పిండిలాగా లేదా ముక్కలుగా విరిగిపోయే ప్రమాదం ఉంది.
జాగ్రత్తలు: ఇంట్లో పాత పాదరసం థర్మామీటర్లు పగిలితే, ఆ పాదరసాన్ని చేతులతో లేదా బంగారు ఉంగరాలు ఉన్న వేళ్లతో తాకకూడదు. కొన్ని రకాల చర్మ సౌందర్య క్రీముల్లో లేదా ల్యాబ్ రసాయనాల్లో పాదరసం ఉండే అవకాశం ఉంటుంది. వాటిని వాడేటప్పుడు ఆభరణాలను తీసి ఉంచడం మంచిది.
ఒకవేళ మీ బంగారం తెల్లగా మారితే, దానిని ఇంట్లో శుభ్రం చేయడానికి ప్రయత్నించకండి. నిపుణులైన కంసాలి (Goldsmith) వద్దకు తీసుకెళ్తే, వారు ప్రత్యేకమైన ఉష్ణ ప్రక్రియ ద్వారా పాదరసాన్ని ఆవిరి చేసి, బంగారాన్ని తిరిగి యథాస్థితికి తీసుకువస్తారు. అయితే, ఈ ప్రక్రియలో కొంత బంగారం బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం ఆభరణాలను ధరించేవారు పాదరసం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న అజాగ్రత్త మీ లక్షల విలువైన నగలను పనికిరాకుండా చేయగలదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..