Stock Market: గతవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..

|

Nov 22, 2021 | 7:12 AM

గత వారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలే ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారంలోనే ముగియనున్న నవంబరు డెరివేటివ్​ కాంట్రాక్ట్​లతో మార్కెట్ కొంతమేర ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు...

Stock Market: గతవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..
Stock Market News
Follow us on

గత వారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలే ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వారంలోనే ముగియనున్న నవంబరు డెరివేటివ్​ కాంట్రాక్ట్​లతో మార్కెట్ కొంతమేర ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతతో గతవారం మన మార్కెట్లు నష్టపోయాయి. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా సమీకరించే నిధుల వినియోగానికి సెబీ నిబంధనలు ప్రతిపాదించడంతో మదుపర్లు అప్రమత్తతతో ట్రేడ్‌ చేశారు. కొవిడ్‌-19 పరిణామాల నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఆర్థిక రంగంపై ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం, దేశీయ ఎగుమతులు పెరగడం లాంటివి మార్కెట్‌కు కొంత సానుకూలతగా భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచొచ్చనే ఆందోళన పెరుగుతోంది. పేటీఎం షేర్ల నమోదు పేలవంగా ఉండటమూ మార్కెట్‌ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బ్యారల్‌ ముడి చమురు ధర 4 శాతం తగ్గి 78.9 డాలర్లకు పరిమితం కావడానికి తోడు ఐపీఓల్లోకి నిధుల రాక వల్ల రూపాయి మారకపు విలువ 0.3 శాతం పెరిగి 74.20కు చేరింది. నవంబరు 25తో డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్​ ముగియనుండటం వల్ల మార్కెట్​ హెచ్చుతగ్గులు ఎదుర్కొవచ్చని ఓ బ్రోకింగ్ సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో అంతర్జాతీయ పరిణామాలపై మదుపరులు దృష్టిసారించే అవకాశం ఉందని చెప్పింది.

ఇటీవల జీవితకాల గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. గచిడిన రెండు మూడు వారాలుగా భారీగా పడుతూ వస్తున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ గతవారం 1050.68 పాయింట్లు దిగజారింది. 60 వేల దిగువకు చేరింది. మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనిస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, దేశీయంగా సానుకూల అంశాలు లేకపోవడం, ఇటీవల ప్రకటించిన సంస్థల క్యూ2 ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్​ కేసుల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిడి, మదుపర్ల లాభాల స్వీకరణతో పాటు పలు కారణాలు వల్ల సూచీలు డీలా పడినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఐపీఓల్లో మదుపర్ల నుంచి మంచి స్పందన లభించిన లేటెండ్‌ వ్యూ అనలటిక్స్‌, టార్సన్స్‌ ప్రోడక్ట్స్‌ షేర్లు ఎక్స్ఛేంజీల్లో ఈ వారం నమోదు కానున్నాయి. చైనా, దక్షిణ కొరియాల కేంద్రీయ బ్యాంకుల పరపతి విధాన సమావేశాలు జరగనున్నాయి. వీటితో పాటు అమెరికా, ఐరోపా, జర్మనీలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలనూ గమనించాలని ఆర్థక నిపుణులు చెబుతున్నారు.

Read Also.. Joint Bank Account: పెన్షన్ కోసం ఉమ్మడి ఖాతా తెరవడం తప్పనిసరి కాదు.. స్పష్టం చేసిన కేంద్రం..