
అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు భారీ నష్టాన్ని చవిచూశారు. దీంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలలో ప్రారంభం అయ్యాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం మార్కెట్ మూలధనం రూ. 4,22,01,433.48 కోట్లుగా నమోదు కాగా.. గురువారం ఉదయం 10:03 గంటలకల్లా, ఇది రూ. 4,11,94,176 కోట్లకు పడిపోయింది. అంటే, కేవలం ఒక గంటలోపే రూ. 10 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చేసిన తాజా హెచ్చరికల కారణంగా చమురు ధరలు పెరగడంతో, BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు రెండూ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభ సమయంలో ఉదయం 9.20 గంటలకు 1454.53 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ 71,679.79 వద్ద స్థిరపడింది. ఇక 453.9 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 22,222.50 వద్ద కొనసాగుతోంది.
రంగాల వారీగా అమ్మకాల ఒత్తిడి
దాదాపు అన్ని రంగాల్లోనూ మదుపరులు షేర్ల అమ్మకానికి మొగ్గు చూపుతున్నారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 1.6శాతం పతనం అవ్వగా మిడ్-క్యాప్ అండ్ స్మాల్-క్యాప్, వరుసగా 1.2 శాతం, 1.5% మేర నష్టపోయాయి. ఇక ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రా షేర్లు కూడా భారీగా పడిపోయాయి. ఇక ఫార్మా అండ్ ఏవియేషన్ రంగంలో విమానయాన, ఔషధ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
నిలకడగా ఐటీ రంగం
మార్కెట్ అంతా నష్టాల్లో ఉన్నప్పటికీ, ఐటీ షేర్లు కొంత మేర నిలకడగా ఉన్నాయి. HCL టెక్నాలజీస్ స్వల్ప లాభాలను గడించగా ఇన్ఫోసిస్ అండ్ TCS పడిపోయినప్పటికీ, మిగిలిన మార్కెట్తో పోలిస్తే వీటి నష్టాలు తక్కువగానే ఉన్నాయి. గ్లోబల్ టెన్షన్స్ , చమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించడంతోనే మార్కెట్ పడిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.