రూ.19684 కోట్ల లాభం వచ్చినా.. SBI షేర్లు ఎందుకు పడిపోయాయి?
ఎస్బీఐ 2025-26 Q4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. బ్యాంక్ నికర లాభం పెరిగినా, మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో షేర్లు దాదాపు 5 శాతం పతనమయ్యాయి. రూ.17.35 డివిడెండ్ ప్రకటించింది. స్థూల నిరర్థక ఆస్తులు తగ్గడంతో ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. అయితే ట్రెజరీ ఆదాయం భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI తాజాగా విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలు మిశ్రమ సంకేతాలను ఇచ్చాయి. బ్యాంక్ భారీ లాభాలను నమోదు చేసినప్పటికీ, మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారులు నిరాశ చెందారు. ఫలితంగా ఎస్బీఐ షేర్లు స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ స్టాండ్అలోన్ నికర లాభం 5.6 శాతం పెరిగి రూ.19,684 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన అయినప్పటికీ, మార్కెట్ విశ్లేషకులు రూ.20,312 కోట్లకు పైగా లాభం వస్తుందని అంచనా వేశారు. అందువల్ల ప్రకటించిన ఫలితాలు పెట్టుబడిదారుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాయి.
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా 4.1 శాతం పెరిగి రూ.44,380 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.42,618 కోట్లుగా నమోదైంది. అయినప్పటికీ ఈ వృద్ధి కూడా మార్కెట్ ఊహించిన స్థాయికి చేరకపోవడంతో దలాల్ స్ట్రీట్లో ప్రతికూల భావన కనిపించింది. ఈ నిరాశ ప్రభావం వెంటనే స్టాక్పై పడింది. ట్రేడింగ్ సమయంలో ఎస్బీఐ షేరు దాదాపు 5 శాతం వరకు పడిపోయి రూ.1,037.5 వద్ద ట్రేడ్ అయింది. ఫలితాల తర్వాత భారీ ర్యాలీ వస్తుందని ఆశించిన ఇన్వెస్టర్లకు ఇది షాక్గా మారింది.
అయితే వాటాదారులకు ఊరటనిచ్చేలా బ్యాంక్ ఒక్కో షేరుకు రూ.17.35 డివిడెండ్ ప్రకటించింది. మే 16, 2026 నాటికి షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు ఈ డివిడెండ్కు అర్హులు. జూన్ 4, 2026న ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆస్తుల నాణ్యత పరంగా మాత్రం ఎస్బీఐ మంచి పనితీరు కనబరిచింది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 1.57 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గాయి. నికర ఎన్పిఏలు 0.39 శాతం వద్ద స్థిరంగా కొనసాగాయి. మొత్తంగా చూస్తే స్థూల ఎన్పిఏలు రూ.73,452.5 కోట్లకు తగ్గడం బ్యాంక్ రుణాల నాణ్యత మెరుగుపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
ఇక ప్రొవిజనింగ్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.6,441 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.2,872 కోట్లు మాత్రమే కేటాయించింది. దీని వల్ల లాభాలకు కొంత మద్దతు లభించింది. అయితే బ్యాంక్ ట్రెజరీ కార్యకలాపాల ఆదాయం భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది రూ.8,991 కోట్లుగా ఉన్న ట్రెజరీ ఆదాయం ఈసారి కేవలం రూ.1,259 కోట్లకు పడిపోయింది. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ కారణంగా బ్యాంకుల వద్ద ఉన్న బాండ్ల విలువ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అదనంగా ఇతర ఆదాయం కూడా సుమారు 29 శాతం తగ్గి రూ.17,314 కోట్లకు చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
