
ఉన్న ఊర్లోనే ఒక మంచి బిజినెస్, చేతి నిండా సంపాదన, దాంతో పాటే నలుగురికి మంచి చేస్తున్నాం అనే సంతృప్తి. ఇంతకంటే ఏం కావాలి. నెలకు రూ.50 వేల పైన ఆదాయం ఇస్తూ, సొంతూళ్లో గౌరవంగా బతికేందుకు ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రామాల్లో సాధారణంగా ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయేతర ఆదాయ మార్గాలు చాలా తక్కువ. అలాంటి గ్రామాల్లో వ్యాపారం చేయాలంటే ఓ మంచి ఐడియా అవసరం. అలాంటిదే వాటర్ ప్లాంట్ బిజినెస్. ఈ మధ్య కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం కాస్త ఖర్చు అయినా పర్లేదు అని భావిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల పెరిగిన ఈ అవగాహనే మీ బిజినెస్కు మూలం.
గ్రామంలో మంచి నీళ్లు పడే చోట ఒక బోర్ వేయించి, ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి.. ఇంటింటికి మీరే మంచి నీరు సప్లయ్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. శుభకార్యాలు, ఫంక్షన్లు ఉంటే వాటికి కూడా ఆర్డర్పై సప్లయ్ చేయవచ్చు. మంచి నీరు అనేది ప్రతి రోజు ప్రజలకు అవసరం. సో డిమాండ్ ఉండదు అనే మాటే లేదు. అయితే ఈ బిజినెస్ కోసం పెట్టుబడిగా ఓ రూ.10 లక్షలు అవసరం అవుతుంది. ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు, బోర్ కోసం ఓ రూ.1 లక్ష, వాటర్ తీసుకెళ్లే వాహనంకోసం ఓ రూ.4 లక్షల ఖర్చు అవుతుంది. ప్లాంట్లో మీరు ఉన్నా పర్లేదు, ఓ వ్యక్తిని పెట్టినా మీరు వేరే పని చూసుకోవచ్చు.
అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బోర్ నీటిని పరీక్ష కోసం కూడా తీసుకెళ్లాలి. అందులోని నాణ్యతను ప్రభుత్వ అధికారులు పరిశీలించి మీకో సర్టిఫికేట్ ఇస్తారు. అయితే మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే నిరంతరం అలర్ట్గా ఉంటూ వాటర్లో మినరల్స్ మోతాదును కచ్చితంగా చూసుకోవాలి. వాటర్ రుచి, రంగు ఎప్పుడూ మారకుండా చూసుకుంటే ప్రజలకు కూడా మీ వాటర్ ప్లాంట్పై విశ్వాసం పెంచుకుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి