
ఇండియాలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ప్రజలు తమ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది భారీగా లాభాలు పొందితే.. మరికొంతమంది నష్టపోతుంటారు. భారత్లో వీటిల్లో పెట్టుబడులు పెట్టేవారు నానాటికి పెరుగుతూనే ఉన్నారు. కొత్త డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసే యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొత్తగా లక్షల మంది వీటిల్లోకి అడుగుపెగుతున్న తరుణంలో కీలక మార్పులకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది. 1996 నుంచి కొనసాగుతున్న నిబంధనల్లో సెబీ కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు సెబీ (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్స్ 2026 పేరుతో కొత్త రూల్స్ను అమల్లోకి తెచ్చింది.
-మ్యూచువల్ ఫండ్స్ వసూలు చేసే టోటల్ ఎక్స్పెన్స్ రేషియోను మూడు భాగాలుగా చేసింది. బేస్ ఎక్స్పెన్స్ రేషియో, బ్రోకరేజ్, చట్టబద్దమైన పన్నులుగా మార్చింది.
-బేస్ ఎక్స్పెన్స్ రేషియోను ఫండ్ మెయింటెనెన్స్కు అవసరమయ్యే ఖర్చుగా పరిగణిస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్స్లో చేసే లావాదేవీల రుసుమును బ్రోకరేజ్గా పేర్కొంటారు. ఇక జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ,ఎక్ఛ్సేంజ్ రుసుంలను చట్టబద్దమైన పన్నులుగా పిలుస్తారు.
-కొత్తగా తెచ్చిన ఈ మార్పులు వల్ల ఇన్వెస్టర్ల ఖర్చులు 5 నుంచి 7 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశమందని తెలుస్తోంది.
-ఇప్పటివరకు ఈ ఛార్జీలన్నీ ఒకేదానిలో ఉన్నాయి. దీంతో దేనికి ఎంత చెల్లిస్తున్నామనేది పెట్టుబడిదారులకు అర్ధం అయ్యేది కాదు. వీటిని మూడు భాగాలుగా విభజించడంతో దేనికి ఎంత చెల్లిస్తు్న్నామనే క్లారిటీ పెట్టుబడిదారులకు ఉంటుంది
-ఈ నిర్ణయం వల్ల ఖర్చులు తగ్గిపోయి మ్యూచువల్స్ ఫండ్స్లో పారదర్శకత పెరుగుతుందని సెబీ తెలిపింది
2025లో ఇన్వెస్టర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ నెలకొన్న రాజకీయ,ఆర్ధిక అనిశ్చితి, దేశాల మధ్య యుద్దాల వల్ల మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీంతో పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీని నుంచి బయటపడాలంటే బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలను ఎంచుకుంటే ఇన్వెస్టర్లు లాభపడతారని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.