
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిపాజిటర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. జూన్ 15 నుంచి ఎస్బీఐ వివిధ కాలపరిమితులలో రూ.3 కోట్ల వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే సేవింగ్స్ ఖాతా రేటును ఆల్-టైమ్ కనిష్ట స్థాయి 2.5 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపులు కొత్త, పునరుద్ధరణ డిపాజిట్లను ప్రభావితం చేస్తాయి. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల తగ్గించడంతో ఎస్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు లాభాల మార్జిన్లను కాపాడటం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేస్తున్నారు.
ఎస్బీఐకు సంబంధించిన రూ.36 లక్షల కోట్ల రుణ పోర్ట్ఫోలియోలో దాదాపు 45 శాతం రెపో రేటుతో ముడిపడి ఉంది. వీటిలో రూ.8.3 లక్షల కోట్ల గృహ రుణాలు, రూ.1.2 లక్షల కోట్ల వాహన రుణాలు ఉన్నాయి. తత్ఫలితంగా కొత్త కస్టమర్లకు బ్యాంకునకు సంబంధించిన అగ్ర గృహ రుణ రేట్లు ఇప్పుడు 7.5 శాతంగా ఉన్నాయి. బెంచ్మార్క్ రేటు తగ్గింపు వల్ల బ్యాంకు వార్షిక వడ్డీ ఆదాయం దాదాపు రూ.8,100 కోట్లు తగ్గుతుందని అంచనా. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి పొదుపు డిపాజిట్ రేట్లను తగ్గించడం వేగవంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొదుపు ఖాతాల్లో రూ.23 లక్షల కోట్లు ఉండటంతో తక్కువ వడ్డీ చెల్లింపు వల్ల బ్యాంకుకు ఏటా దాదాపు రూ.5,750 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు.
ఈ తరహా సర్దుబాట్లు ఎస్బీఐ మాత్రమే చేయడం లేదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా అధిక విలువ కలిగిన డిపాజిట్లపై తన పొదుపు ఖాతా రేటును అన్ని నిల్వలపై 2.75 శాతానికి తగ్గించిందని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. అలాగే ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై 10 నుంచి 35 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుణదాతల తక్కువ బెంచ్మార్క్ వడ్డీ రేట్లకు అనుగుణంగా మార్పులు చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి