
Silver Price: ప్రస్తుతం మార్కెట్లో వెండికి భారీగా డిమాండ్ ఉంది. దీని ధర రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఎందుకంటే సిల్వర్ను ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర పరికరాల్లో వాడకం ఎక్కువగా ఉండటంతో దీని ధర మరింతగా పెరుగుతోంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో కనీవిని ఎరుగని మహా పతనం ఇప్పటికే ప్రారంభమైందని ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, అమెరికన్ బిజినెస్మెన్ రాబర్ట్ కియోసాకి ఇన్వెస్టర్లను హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడికి పేరున్న బంగారం, వెండి ధరలు మున్ముందు భారీగా పెరగనున్నాయని కియోసాకి అంటున్నారు. ప్రస్తుతం 50 డాలర్ల స్థాయిలో ఉన్న ఔన్స్ సిల్వర్.. త్వరలోనే 70 డాలర్లకు దూసుకుపోవచ్చని, వచ్చే సంవత్సరం చివరినాటికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.1.69 లక్షలు పలుకుతోంది. కియోసాకి అంచనాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 200 డాలర్లకు పెరిగితే.. దేశీయంగా కిలో వెండి రూ.6.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు షాక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..
అమెరికా మార్కెట్లో మొదలైన ఈ పతనం క్రమంగా యూరప్, ఆసియా మార్కెట్లకు వ్యాపించనుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను రక్షించుకునేందుకు ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అ కష్టకాలంలో బంగారం, వెండితోపాటు బిట్కాయిన్, ఎథిరియం వంటి క్రిప్టోకరెన్సీలే పెట్టుబడుల విలువను పెంచగలవని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Zodiac Sign: ఈ 3 రాశుల వారికి డిసెంబర్ నెల ఎంతో అదృష్టం.. జీవితాల్లో ఎన్నో అద్భుతాలు
కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీల షేర్లలో ఏర్పడిన భారీ బుడగ ఎప్పుడైనా పేలవచ్చన్న ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడికి లోనవుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. ఇందుకు తోడు ఏఐ టెక్నాలజీ దెబ్బకు ఉద్యోగాల ఊచకోత కూడా ఇప్పటికే మొదలైందని, రాబోయే సంవత్సరాల్లో ఇది తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లక్షల్లో ఉద్యోగాలు హరించుకుపోతే.. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కుప్పకూలుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి