ఏప్రిల్‌ 8న RBI కీలక సమావేశం! లోన్లు తక్కువ వడ్డీకి లభించే ఛాన్స్‌?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశాల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యంగా రెపో రేటుపై కీలక నిర్ణయాలు తీసుకునే ఈ ఆరు ద్వైమాసిక సమావేశాలు ఏప్రిల్ 6-8న ప్రారంభమవుతాయి.

ఏప్రిల్‌ 8న RBI కీలక సమావేశం! లోన్లు తక్కువ వడ్డీకి లభించే ఛాన్స్‌?
Rbi

Updated on: Mar 24, 2026 | 6:00 AM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశాల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆరు ద్వైమాసిక సమావేశాలు జరగనున్నాయి. మొదటి కీలక రేటు నిర్ణయ సమావేశం ఏప్రిల్ 6 నుండి 8 వరకు నిర్వహించనున్నారు. ఆర్‌బిఐ గవర్నర్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఆరుగురు సభ్యుల మోనిటరీ పాలసీ కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై, దేశంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక వృద్ధి ధోరణులు, గ్లోబల్ మార్కెట్ పరిణామాలను సమీక్షిస్తుంది. సాధారణంగా మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో, చివరి రోజున కీలక నిర్ణయాలపై ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత గవర్నర్ అధికారికంగా రెపో రేటుపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

ఆర్‌బిఐ వెల్లడించిన వివరాల ప్రకారం రెండవ సమావేశం జూన్ 3-5 తేదీలలో జరుగనుంది. అనంతరం ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, 2027 ఫిబ్రవరిలో మిగతా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు దేశ ఆర్థిక విధాన దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో MPC వ్యవస్థను 2016లో ప్రవేశపెట్టారు. ఇందులో ముగ్గురు ఆర్‌బిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు బాహ్య సభ్యులు ఉంటారు. ఈ కమిటీ ప్రధాన బాధ్యత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రామాణిక వడ్డీ రేటు అయిన రెపో రేటును నిర్ణయించడం. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్దిష్ట పరిధిలో ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం.

ఇటీవల ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో MPC రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. అంతకుముందు, గత ఏడాది మొత్తంగా ఆర్‌బిఐ వడ్డీ రేట్లను 1.25 శాతం వరకు తగ్గించింది. చివరిసారిగా డిసెంబర్‌లో 25 బేసిస్ పాయింట్ల కోతను ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో, ఏప్రిల్ సమావేశంలో ఆర్‌బిఐ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందా లేదా మార్పులు చేస్తుందా అన్నది మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us