
ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో మొబైల్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చేతిలో మొబైల్ లేనిది ఏ పని జరగడం లేదు. అరచేతిలో మొబైల్ ఉంటే ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు. మొబైల్తో ఇంటి నుంచే ఏ పనైనా సులువుగా చేసుకోవచ్చు. దీంతో ప్రతీఒక్కరికీ దీని అవసరం ఉండటంతో.. ఆర్థిక స్తోమత లేనివారు ఈఎంఐ రూపంలో మొబైల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్ని నెలల పాటు ఈఎంఐ చెల్లించాక.. ఆ తర్వాత చెల్లించలేక వదిలేస్తుంటారు. ఇలాంటప్పుడు మీ మొబైల్ ఫోన్ పని కాకుండా లాక్ అయిపోవచ్చు. రుణం ఇచ్చిన సంస్థలు మీ ఫోన్ను లాక్ చేయవచ్చు. ఇలాంటి ప్రతిపాదనపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది.
ఈఎంఐ చెల్లించనప్పుడు మీ ఫోన్ను రుణం ఇచ్చిన సంస్థలు రిమోట్ విధానంలో లాక్ చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ వాయిదాలు మిస్ అయ్యాక లాక్ చేస్తారు. దీంతో యూపీఐ, బ్యాంకింగ్, సోషల్ మీడియా యాప్లు పనిచేయవు. కేవలం కాల్స్ మాత్రమే పనిచేస్తాయి. రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించనప్పుడు సంస్థలు మొబైల్ను రిమోట్గా నిలిపివేందుకు అనుమతి ఇచ్చే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. అయితే లాక్ చేసేముందు కస్టమర్కు తప్పనిసరిగా నోటీసులు అందించాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని పద్దతులను కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇండియాలో దాదాపు 1.16 బిలియన్లకుపైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది ఈఎంఐ పద్దతిలో మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దీనిని అమల్లోకి తెచ్చే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. నిత్యావసర సేవలను మినహాయించి మిగతా వాటిని క్రమబద్దంగా అమలు చేసే విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది.
రుణం మంజూరు చేసే సంస్థలు రికవరీ వేగంగా చేసుకునేందుకు ఆర్బీఐ ప్రతిపాదన ఉపయోగపడుతుంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. వివిధ వర్గాల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆర్బీఐ దీనిని అమలు చేయనుంది.