
Ratan Tata: భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగత జీవితం అనేక ఆసక్తికరమైన మలుపులతో నిండి ఉంది. ఆయన బాల్యం నుండి ప్రేమ వరకు, కొన్నిసార్లు వివాదాల వరకు ఆయన జీవితంలోని తెలియని కోణాలను ఈ కథనం వివరిస్తుంది. రతన్ టాటా మరణించినప్పటికీ ఆయన జీవిత విశేషల గురించి తెలుసుకుంటూనే ఉంటారు.
వివిధ కథనాల ప్రకారం ఆయన జీవిత విశేషల గురించి తెలుసుకుందాం.. రతన్కు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన తండ్రి సిమోన్ డునోయర్ అనే స్విస్ మహిళను పెళ్లాడగా, తల్లి సర్ జంషెడ్జీ జీజీభాయ్ ను వివాహం చేసుకున్నారు. దీంతో రతన్ను ఆయన నానమ్మ లేడీ నవాజ్బాయ్ పెంచి పెద్ద చేశారు. చిన్నతనంలో రోల్స్ రాయిస్ కార్లో స్కూల్కు వెళ్లిన రతన్ టాటా, అమెరికాలో చదువుకునే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో విదేశాల్లో చదవడానికి రిజర్వ్ బ్యాంక్ చాలా తక్కువ విదేశీ కరెన్సీని మాత్రమే అనుమతించేది. “మా నాన్నకు చట్టాలను ఉల్లంఘించడం నచ్చదు. ఆయన నా కోసం బ్లాక్లో డాలర్లు కొనేవారు కాదు. దీంతో తరచూ నెల ముగిసేలోపే నా దగ్గర డబ్బులు అయిపోయేవి. దాంతో స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. చాలాసార్లు అదనంగా డబ్బు సంపాదించడానికి పాత్రలు కూడా కడిగాను” అని గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా వివరించారు.
ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
రతన్ టాటా అమెరికాలో ఏడేళ్లు గడిపారు. లాస్ ఏంజెలెస్లో ఆయనకు మంచి ఉద్యోగం, ఇల్లు ఉండేవి. ఆ సమయంలో ఆయన ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, నానమ్మ కోరిక మేరకు ఆయన భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. తను నాతో భారత్కు వస్తుందని అనుకున్నా. కానీ, ఆ సమయంలో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతుండటంతో ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు” అని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా పేర్కొన్నారు. ఆ తర్వాత రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు.
టిటో, టాంగో అనే రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలంటే రతన్ టాటాకు చాలా ఇష్టం. గిరీష్ కుబేర్ రాసిన ది టాటాస్.. హౌ ఎ ఫ్యామిలీ బిల్ట్ ఎ బిజినెస్ అండ్ ఎ నేషన్ పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారు. ముంబైలో ఉన్నప్పుడు వారాంతాల్లో అలీబాగ్లోని తన ఫామ్హౌస్లో గడిపేవారు. ఆ సమయంలో తన కుక్కలు తప్ప ఆయనతో ఇంకెవరూ ఉండేవారు కాదు. ఆడంబరాలంటే చిరాకు పడే రతన్ టాటాకు ప్రయాణాలు చేయడం, ప్రసంగాలు ఇవ్వడమన్నా పెద్దగా నచ్చేవి కావు. ఇంట్లో ఏకాంతంగా ఫైళ్లు, డాక్యుమెంట్లు చదువుకోవడానికి ఇష్టపడేవారు. ఆఫీస్ పని కోసం తనను ఇంట్లో కలవాలని ఎవరైనా అడిగితే చిరాకు పడేవారు.
రతన్ టాటా గొప్ప మానవతావాది. భారత్లో కోవిడ్ విజృంభించినప్పుడు, ఆయన అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి రూ. 500 కోట్లు, టాటా కంపెనీల నుంచి రూ. 1000 కోట్లు ఇచ్చారు. కరోనా సమయంలో సేవలు చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని మొదట ఆఫర్ చేసింది కూడా రతన్ టాటానే. అయితే, ఆయన చుట్టూ కొన్ని వివాదాలు కూడా నెలకొన్నాయి. 2010లో లాబీయిస్ట్ నీరా రాడియా టెలిఫోన్ సంభాషణలు లీక్ అవడంతో రతన్ టాటా వివాదంలో చిక్కుకున్నారు. తర్వాత 2020లో తమ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ యాడ్ కూడా ఆయనకు తలనొప్పి తీసుకువచ్చింది. చివరకు దాన్ని వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. కనీస సమయం ఇవ్వకుండా టాటా గ్రూప్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు కూడా రతన్ టాటాపై విమర్శలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Gas Cylinder: సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్న్యూస్.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి