
రైళ్లలో ధూమపానం చేసే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. రైల్వేల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధూమపానంపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. జన్ విశ్వాస్ చట్టం నిబంధనల సవరింపు కింద తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇటీవలే విడుదల కాగా.. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఇవి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం.. రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేస్తూ పట్టుబడితే భారీ జరిమానాతో పాటు అవసరాన్ని బట్టి టికెట్ను రద్దు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి జైలు శిక్ష విధించే అవకాశాన్ని కూడా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలపై రాజీ ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది.
అంతేకాదు.. రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులను ఆక్రమించడం, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం వంటి అంశాలపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త నిబంధనలు మార్గం సుగమం చేస్తున్నాయి. దీంతో రైళ్లలో బెర్తుల ఆక్రమణకు కూడా చెక్ పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ప్రయాణికుల భద్రత, పరిశుభ్రత, క్రమశిక్షణను మెరుగుపర్చడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని రైల్వే శాఖ తెలిపింది.
జూలై 1 నుంచి కొత్త నిబంధనలను దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయనున్న నేపథ్యంలో.. ప్రయాణికులు రైల్వే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా నిబంధనలు విరుద్దంగా వ్యవహిరిస్తే.. వారిపై చట్టపరమైన చర్యలకు అధికారులు వెనకాడబోరని స్పష్టం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.