
Train Tickets Booking: ప్రయాణికులు సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు రైల్వేశాఖ అనేక సదుపాయాలు కల్పిస్తోంది. కానీ రైల్వేశాఖ అందిస్తున్న సదుపాయాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. దీంతో అర్హత ఉండి కూడా వాటిని ఉపయోగించుకోలేకపోతుంటారు. విద్యార్థులకు బస్సుల్లో రాయితీపై ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటం అందరికీ తెలిసిందే. స్టూడెంట్ బస్ పాస్ ద్వారా తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు. ఇక రైళ్లల్లో కూడా విద్యార్థులకు రాయితీతో కూడిన ప్రయాణం ఉందని మీకు తెలుసా..? రైళ్లల్లో వృద్దులు, అంగవైకల్యం ఉన్నవారికి టికెట్లపై రాయితీ ఉన్న విషయం తెలిసిందే. కానీ విద్యార్థులు కూడా టికెట్ల ధరలపై డిస్కౌంట్ పొందే సదుపాయం అమల్లోకి ఉంది.
రైల్వేశాఖ రూల్స్ ప్రకారం.. స్కూల్ లేదా కాలేజ్ విద్యార్థులు ట్రైన్ ద్వారా ప్రయాణం చేస్తే 50 నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. కానీ ఐఆర్సీటీసీ యాప్ లేదా ఇతర ఫ్లాట్ఫామ్ల ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్ రాదు. 12 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్కి వెళ్లి తీసుకునే టికెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. జనరల్ కేటగిరీ విద్యార్ధులు 50 శాతం వరకు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 75 శాతం వరకు తమ టికెట్పై డిస్కౌంట్ పొందుతారు.
టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్లి స్టూడెంట్ ఐడీ కార్డు సమర్పిస్తే డిస్కౌంట్ లభిస్తుంది. సెకండ్, స్లీపర్ క్లాస్ టికెట్లకు మాత్రమే ఇది వస్తుంది. ఏసీ క్లాస్ ప్రయణానికి ఇవ్వరు. విద్యార్థులు స్టడీ రీత్యా వివిధ ప్రాంతాలకు తిరగాల్సి ఉంటుంది. అందువల్ల రైల్వేశాఖ ఈ సదుపాయం కల్పించింది. ఇది ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా.. చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. బస్సుల్లో బస్ పాస్ తరహాలోనే రైల్వేశాఖ ఇలా రాయితీ ఇస్తోంది. మీరు విద్యార్థి అయి ఐడీ కార్డు కలిగి ఉంటే ఈ డిస్కౌంట్ పొందండి.