
డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. అందులో బాగా పాపులర్ అయిన, అందరికీ తెలిసిన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). ఉద్యోగులు, వ్యాపారులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక ఆదాయంతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీంతో అధిక మొత్తంలో జీతం తీసుకునేవారికి, వ్యాపారులకు ఇది మంచి పథకమని చెప్పవచ్చు. అధిక ఆదాయం, ట్యాక్స్ బెనిఫిట్స్, ప్రభుత్వం నిర్వహించే సేవింగ్స్ స్కీమ్ కావడంతో భద్రత ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది పీపీఎఫ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
ఒక వ్యక్తి పేరుపై ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు తెరవచ్చా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పీపీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక అకౌంట్ మాత్రమే తెరవడానికి అనుమతి ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్ 2019 నిబంధనల ప్రకారం ఫారం-1 నింపి ఏ వ్యక్తి అయినా సులువుగా ఈ అకౌంట్ తెరవొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, ఉమ్మడి ఖాతాలు తెరవడానికి అనుమతి లేదు. ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సేవింగ్స్ ఇన్స్టిట్యూట్ అధికారిక వెబ్ సైట్లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి.
ఒక వ్యక్తి పేరు మీద రెండు అకౌంట్లు తెరిస్తే.. రెండోసారి తెరిచిన అకౌంట్ చెల్లదు. మీ పీపీఎఫ్ అకౌంట్ పాన్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. దీని మీరు రెండో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దీంతో రెండో అకౌంట్ను చెల్లనిదిగా పరిగణిస్తారు. మీరు రెండో ఖాతాలో జమ చేసిన సొమ్మును వడ్డీ లేకుండా తిరిగి ఇచ్చేస్తారు. ఒక వ్యక్తి పేరుపై ఒక పీపీఎఫ్ ఖాతా మాత్రమే తెరవడానికి అనుమతి ఉంది. ఇక మైనర్లకు కూడా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కానీ వారికి 18 ఏళ్లు వచ్చేంతవకు సంరక్షకుడి ఆధ్వర్యంలో ఇది నిర్వహించాల్సి ఉంటుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీకు మెచ్యూరిటీ పిరియడ్ తర్వాత అధిక మొత్తంలో ఒకేసారి వడ్డీతో సహా పొందవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం ఉంది. బ్యాంకుల ఫిక్స్ డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టాలంటే ఇతర సేవింగ్స్ స్కీమ్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.