Free Power: 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.. సామాన్యులకు కేంద్రం కొత్త పథకం.. దరఖాస్తు ఇలా..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు గత ఏడాదిలో ఒక పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని ఉచిత విద్యుత్ పొందవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Free Power: 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.. సామాన్యులకు కేంద్రం కొత్త పథకం.. దరఖాస్తు ఇలా..
Power Bill

Updated on: Jun 05, 2026 | 2:23 PM

పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరెంట్ బిల్లు కట్టాల్సిన పని లేదు. సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే విద్యుత్‌ను మీ ఇంటికి వినియోగించుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సౌకర్యం కూడా కల్పిస్తోంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో పథకం కూడా అమలు చేస్తోంది. అదే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. గత ఏడాది ఈ స్కీమ్ కేంద్రం ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటి? ఎలా లబ్ది పొందాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై తాజాగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్ ద్వారా 200 యూనిట్లు కాదని, 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 25 లక్షల ఇళ్లకు బిగించామని, 2026 డిసెంబర్ నాటికి మొత్తం 75 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామన్నారు. కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకోవడం  ఎలా..

2024 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఇప్పటివరకు రూ.75 వేల కోట్లు కేటాయించింది. 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం 60 శాతం వరకు రాయితీ సౌకర్యం కల్పిస్తుండగా.. 2 నుంచి 3 కిలోవాట్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇక 1 కిలోవాటర్ ప్యానెల్స్ అయితే రూ.30 వేలు సబ్సిడీ ఇస్తోంది. 3 కిలోవాట్ కంటే ఎక్కువుంటే రూ.78 వేల వరకు రాయితీ ఇస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గ్రూప్ హౌసింగ్ సొసైటీ, రెసిడెన్షియల్ వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. pmsuryaghar.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్, ఈమెయిల్, కనెక్షన్ నెంబర్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైనవారు దరఖాస్తు చేసుకుని ఈ పథకం ద్వారా లబ్ది పొందాలని ప్రభుత్వం చెబుతోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో మిగిలిన కరెంట్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు.

Follow Us