
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.6 వేల నగదు సాయం అందిస్తోంది. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ ద్వారా రైతుల పంటలకు బీమా సౌకర్యం అందిస్తోంది. ఇక ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పనిముట్లపై సబ్సిడీ, పొలాల్లో సొలార్ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీలు వంటివి అందిస్తోంది. అయితే ఇవే కాదు.. రైతులకు కేంద్రం పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. వృద్దాప్యంలో రైతులు పని చేయలేరు. దీంతో వారికి ఎలాంటి స్థిరమైన ఆదాయం ఉండకపోవంతో ఆర్ధిక భరోసా ఉండదు. దీంతో వృద్దాప్యంలో రైతులకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు పెన్షన్ సదుపాయం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ థన్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీములో ఎలా చేరాలి..? ఎవరెవరు అర్హులు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
-వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
-పట్టాదారు పాస్ బుక్ కలిగి ఉండాలి
-భారత పౌరులు అయి ఉండాలి
-రేషన్ కార్డు కలిగి ఉండాలి
-ఇతర పెన్షన్, సామాజిక భద్రత పథకాల్లో చేరి ఉండకూడదు
-నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి పథకాల్లో ఉన్నవారు కూడా అనర్హులు
– ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ధన్ యోజన పథకంలో ఉన్నవారు కూడా ఇందులో చేరలేరు
-ప్రధాన మంత్రి లఘు వ్యాపారి మాన్ధన్ యోజన స్కీములో ఉన్నవారు కూడా అనర్హులు
-ఆర్ధిక స్తోమతవారు ఉన్న కూడా పెన్షన్ స్కీములో చేరేందుకు అనర్హులు
-ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారు, కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు అర్హులు
-కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు ఈ పథకానికి అనర్హులు
-రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనర్హులు
-స్థానిక సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగులు కూడా అర్హత లేదు
సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది. తక్కువ వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీరు కొంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే.. కేంద్రం అందుకు సమానమైన మొత్తం చెల్లిస్తుంది. 60 ఏళ్లు దాటాక లబ్దిదారుడికి నెలకు రూ.3 వేల పెన్షన్ వస్తుంది. ఒకవేళ పెన్షన్దారుడు మరణిస్తే జీవిత భాగస్వామిగా లేదా నామినికి 50 శాతం ప్రతీ నెలా అందుతుంది.