ప్రతినెలా రూ.9,250 ఇన్‌కమ్..! అదిరిపోయే స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా, పెట్టిన పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటూ.. ప్రతి నెల ఒక నిర్దిష్టమైన ఆదాయం రావాలని కోరుకునేవారికి ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు, సురక్షితమైన పెట్టుబడి మార్గాలను వెతుకుతున్నవారికి ఈ పథకం ఒక వరంగా మారుతోంది.

ప్రతినెలా రూ.9,250 ఇన్‌కమ్..! అదిరిపోయే స్కీమ్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
Post Office Mis

Updated on: May 16, 2026 | 6:50 PM

కేంద్ర ప్రభుత్వ రక్షణతో నడిచే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో ఈ వడ్డీ రేటుకు ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి 100 రూపాయలకు ఏడాదికి రూ.7.40 వడ్డీ వస్తుంది. ఈ వార్షిక వడ్డీని 12 నెలలకు విభజించి, ప్రతి నెల అకౌంట్‌లో జమ చేస్తారు. దీనివల్ల నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత మీరు పెట్టిన అసలు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు.

గరిష్టంగా ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు?

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఆపై రూ.1,000 గుణిజాల్లో ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. అయితే ఇందులో పెట్టుబడి పెట్టడానికి కొన్ని గరిష్ట పరిమితులు ఉన్నాయి.

  • సింగిల్ అకౌంట్: ఒక వ్యక్తి తన పేరు మీద గరిష్టంగా రూ.9,00,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనివల్ల ఏడాదికి రూ.66,600 వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి నెల సుమారు రూ.5,550 ఆదాయం అందుతుంది.
  • జాయింట్ అకౌంట్: ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ.15,00,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని ద్వారా ఏడాదికి రూ.1,11,000 వడ్డీ వస్తుంది. అంటే ప్రతి నెల ఖాతాదారులకు రూ.9,250 చేతికి అందుతుంది.

అర్హతలు – నిబంధనలు

భారతదేశంలో నివసించే ఏ పౌరుడైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఒకరు ఒంటరిగా గానీ, లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్‌గా గానీ దీనిని నిర్వహించవచ్చు. మైనర్ల తరపున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం ఉంది. 10 సంవత్సరాల వయసు పైబడిన మైనర్లు ఈ ఖాతాను సొంతంగా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.

ఒక ఖాతాలో ఒకేసారి మాత్రమే లంప్‌సమ్ (మొత్తంగా) అమౌంట్ డిపాజిట్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి ఏడాది వరకు డబ్బులు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఐదేళ్ల కంటే ముందే అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే కొంత పెనాల్టీ విధిస్తారు. అకౌంట్ తెరిచిన ఒకటి నుంచి మూడేళ్ల లోపు క్లోజ్ చేస్తే డిపాజిట్ సొమ్ము నుంచి 2 శాతం కట్ చేస్తారు. అదే మూడు సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తే 1 శాతం నిధులు కోత విధిస్తారు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ అకాల మరణం చెందితే, డిపాజిట్ చేసిన పూర్తి సొమ్మును వడ్డీతో సహా నామినీకి అందజేస్తారు.

ముఖ్య విషయాలు

ఈ స్కీమ్ ద్వారా వచ్చే నెలవారీ వడ్డీని విత్‌డ్రా చేసుకోకుండా అకౌంట్‌లోనే వదిలేస్తే, దానిపై అదనంగా ఎలాంటి వడ్డీ రాదు. అలాగే ఆ వడ్డీ చక్రవడ్డీగా మారదు. అయితే, ఈ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆటో-క్రెడిట్ (ECS) సదుపాయం ద్వారా ప్రతి నెల వచ్చే వడ్డీని నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలోకి లేదా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత ఈ ఖాతాను పొడిగించే అవకాశం ఉండదు.

ఒకవేళ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోకపోతే, సాధారణ పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ మాత్రమే లభిస్తుంది. పెట్టుబడి భారీగా పెరగకపోయినా, రూపాయి నష్టం లేకుండా ప్రతి నెల స్థిరమైన లాభాన్ని ఇచ్చే నమ్మకమైన సాధనం కోసం చూసేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక చక్కని ఆర్థిక భరోసా.

Follow Us