Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. పూర్తిగా మారనున్న ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు.. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివే..

ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఆదాయపు పన్ను శాఖ పలు నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 2025 ఏప్రిల్ 1 నుంచ అమల్లోకి రానుంది. దీంతో పాటు బడ్జెట్‌లో చేసిన పలు ప్రకటనలతో పలు మార్పుల కొత్తగా రానున్నాయి.

Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. పూర్తిగా మారనున్న ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు.. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివే..
Money

Updated on: Feb 09, 2026 | 6:20 PM

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి వస్తోంది. అలాగే ఆదాయ పన్ను పరిమితులకు సంబంధించి ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్, పెట్టుబడులు, టీడీఎస్, టీసీఎస్‌కు సంబంధించి అనేక నియమాలు మారనున్నాయి. జీతం పొందే వ్యక్తుల నుంచి పెట్టుబడిదారులు, వ్యాపారులు, కంపెనీలను ఈ రూల్స్ ప్రభావితం చేయనున్నాయి. కొత్త ఆర్ధిక సంవత్సరం 2026-27 నుంచి మారనున్న కొత్త ఐటీ నిబంధనల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. దీంతో వీటి గురించి ఇప్పుడు చూద్దాం.

షేర్ బైబ్యాక్‌పై కొత్త రూల్

ఇప్పటివరకు షేర్ బైబ్యాక్‌ల ద్వారా వచ్చే ఆదాయంను డివిడెంట్ ఆధారంగా పరిగణించి ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్ ప్రకారం పన్ను విధించేవారు. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే లాభాలను మూలధన లాభాలుగా పరిగణిస్తారు. స్టాక్ ట్రేడింగ్, కొనుగోలు ధర, హోల్డింగ్ వ్యవధి ఆధారంగా ట్యాక్స్ లెక్కిస్తారు.

ఎస్‌టీటీ ట్యాక్స్ పెంపు

ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెక్యూరిటీస్ ఫ్యూచర్స్ ట్రేడ్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్(STT) పెంచారు. ప్యూచర్ ట్రేడింగ్‌కు ఎస్‌టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతం పెరిగింది. ఇక ట్రేడింగ్ ఆప్షన్స్‌ ప్రీమియంను 0.10 శాతం నుంచి 0.15 శాతానికి పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

మ్యూచువల్ ఫండ్స్ ఆదాయం

ఇక మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్ల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీపైూ పన్ను మినహాయింపు ఉండదు. రుణం తీసుకున్న నిధులతో పెట్టుబడి పెట్టినప్పటికీ పన్ను మినహాయింపులు ఉండవు. గతంలో వీటిపై పన్ను మినహాయింపులు ఉండేవి. ఇప్పుడు నిబంధనల్లో మార్పులు చేశారు.

సావరిన్ గోల్డ్ బాండ్స్‌ రూల్స్ ఇవే

నేరుగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB)కు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. సెకండరీ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన SGBలు రిడెంప్షన్ తర్వాత మూలధన లాభాలకు పన్ను ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ఉండే బాండ్లపై టాక్స్ ఫ్రీ సదుపాయం ఉంటుంది.

ఒకే డిక్లరేషన్

ఇక నుంచి వివిధ ఆదాయ వనరుల కోసం బహుళ ఫారమ్‌లను దాఖలు చేయడానికి బదులుగా టీడీఎస్‌ను నివారించడానికి పెట్టుబడిదారులు ఒకే డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు. పన్ను మినహాయింపులను నివారించడానికి పదే పదే ప్రత్యేక ఫారమ్‌లను పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. మ్యూచువల్ ఫండ్స్, డివిడెంట్లు, బాండ్స్ అన్నీ ఒకే డిక్లరేషన్‌లో కవర్ చేయబడతాయి.

ఎన్నారైల నుంచి ఆస్తి కొనుగోలు సులభం

ఇక ఎన్నారైల నుంచి ఆస్తి కొనుగోలు చేయడం అనేది మరింత సలభం కానుంది. ప్రవాస భారతీయుడు ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు టీడీఎస్ తగ్గింపు కోసం TAN అవసరం లేదు. పాన్‌ను మాత్రమే ఉపయోగించి టీడీఎస్‌ను తగ్గించుకోవచ్చు.